ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా సీజ్.. నలుగురు అరెస్ట్
నేరెడ్ మెట్, వెలుగు: కొబ్బరికాయల లోడ్ మధ్యలో గంజాయి తరలిస్తున్న ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటీ, ఆలేరు పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద రూ.2 కోట్లు విలువైన 900 కిలోల గంజాయి, ఒక డీసీఎం, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నేరెడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ ఆఫీస్లో మీడియాకు సీపీ మహేశ్భగవత్ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన వికాస్ బబన్ సాల్వే (28), వినోద్ చంద్రావన్ కల్కార్ (26), కిశోర్ తులసీరామ్ వాడేకర్ (24), కోస చిట్టిబాబు (19)ను అరెస్ట్ చేశారు. యోగేశ్ దత్తు, ఒడిశాకు చెందిన పాలసి కర్రయ్య కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడైన యోగేశ్ దత్తు గంజాయి అమ్మాలని తన ఫ్రెండ్స్ వికాస్ బబన్, వినోద్, కిశోర్లకు చెప్పాడు. తామంతా కలిసి గంజాయి అమ్మితే మంచి కమీషన్ వస్తుందన్నాడు.
తనకు గంజాయి కావాలని ఒడిశాలోని మల్కాన్గిరికి చెందిన కోస చిట్టి బాబుకు యోగేశ్ చెప్పాడు. గంజాయి తీసుకెళ్లడానికి తన మనుషులను పంపిస్తున్నానని తెలిపాడు. దాంతో డీసీఎం డ్రైవర్ కిశోర్ను తీసుకుని వికాస్, వినోద్లు బయలుదేరారు. మొదట తూర్పు గోదావరిలోని రావులపాలెంకు వెళ్లి కొబ్బరికాయలు కొని డీసీఎంలో లోడ్ చేశారు. అనంతరం అక్కడి నుంచి మల్కాన్గిరికి వెళ్లి 900 కిలోల గంజాయి కొన్నారు. సరుకును కొబ్బరికాయల కింద లోడ్ చేసి మహారాష్ట్రకు బయలుదేరారు. సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు ఆలేరు పోలీసులతో కలిసి సోమవారం ఆలేరుచౌరస్తాలో వెహికల్ను అడ్డుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని, వారిపై పీడీ యాక్ట్ పెడతామని మహేశ్ భగవత్ తెలిపారు.