వరదనీటిలో చిక్కుకున్న మల్లంపేట వాసులు.. రెస్క్యూ చేసి రక్షించిన దుండిగల్ సీఐ బృందం

వరదనీటిలో చిక్కుకున్న మల్లంపేట వాసులు.. రెస్క్యూ చేసి రక్షించిన దుండిగల్ సీఐ బృందం

తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వరదనీటితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుత్బుల్లాపూర్ మల్లంపేటలో వరద నీటిలో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసి పోలీసులు రక్షించారు. ప్రమాద స్థలం నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు దుండిగల్ సీఐ రామకృష్ణ బృందం తరలించింది.

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మల్లంపేటలోని సుమారు 60 ఇండ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇళ్లల్లో నివాసముంటున్న చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉండడంతో దుండిగల్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఓ మర బోటు సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. సుమారు 150 మందికి స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో భోజనాలు ఏర్పాటు చేశారు. దుండిగల్ సీఐ రామకృష్ణ బృందం చేసిన సాహసానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.