అమెరికాలో ఇండియా ఫ్యామిలీ అనుమానాస్పద మృతి

అమెరికాలో ఇండియా ఫ్యామిలీ అనుమానాస్పద మృతి

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఓ భారత సంతతి కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్లెయిన్స్‌బొరో ప్రాంతంలో బుధవారం (అక్టోబర్ 4న) ఈ ఘటన బయటపడింది. స్థానికంగా నివసించే తేజ్ ప్రతాప్ సింగ్ (43), ఆయన భార్య సోనాల్ పరిహార్ (42), వారి పదేళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వారు ఎలా ఉన్నారో వెళ్లి చూడండంటూ స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ప్రతాప్ సింగ్ ఇంటికి చేరుకోగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 

ప్రతాప్ సింగ్ ముందు ఇంట్లో వారిని చంపి ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అక్కడి పోలీసులు భావిస్తున్నట్టు స్థానిక మీడియా చెప్పింది. ఈ ఘటనలో ఎలాంటి కాల్పులు చోటుచేసుకోలేదని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు. భార్యాభర్తల్లో ఒకరు ఐటీ రంగంలో మరొకరు మానవవనరుల విభాగంలో పని చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. వారి కుటుంబం సంతోషంగానే కనిపించేదని, ఇంతటి ఘోరం జరుగుతుందని తాము అనుకోలేదని మృతుల బంధువులు తెలిపారు.