
తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలంలో మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్లో ప్లాట్లకు అధికారులు సోమవారం (అక్టోబర్ 06) వేలం నిర్వహించారు. ఈ వేలంలో గజం రూ. లక్షా 14 వేల రికార్డు స్థాయి ధర పలికింది.
513 గజాల విస్తీర్ణంలోని హెచ్ఐజీ ఓపెన్ ప్లాట్ కు ఆఫ్ సెట్ ప్రైజ్ రూ.80 వేలు నిర్ధారించగా.. బహిరంగ వేలంలో చదరపు గజం రూ. 1.14 లక్షలకు కొనుగోలు చేసినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం పత్రికా ప్రకటనలో తెలిపారు. హెచ్ఐజీలోనే మరో 389 చదరపు గజాల విస్తీర్ణం లోని ఓపెన్ ప్లాట్ ను వేలం వేయగా. చదరపు గజానికి లక్ష రూపాయల ధర పలికిందని వెల్లడించారు.
మొత్తం 18 ఓపెన్ ప్లాట్లు, 4 ఫ్లాట్ల విక్రయానికి బహిరంగ వేలం వేయగా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.44.24 కోట్ల మేర ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. 27 మంది బిడ్డర్లు పాల్గొన్న ఈ వేలం పాటలో చదరపు గజానికి సగటునరూ.91.947 ధర పలికిందని చెప్పారు.