ఎగ్జాం తప్పినందుకు..యూట్యూబ్​పై కోర్టుకెక్కిండు

ఎగ్జాం తప్పినందుకు..యూట్యూబ్​పై కోర్టుకెక్కిండు
  • రూ. 75 లక్షలు ఇప్పించాలంటూ సుప్రీంలో యువకుడి పిటిషన్ 
  • యువకుడికే 25 వేలు ఫైన్ వేసిన కోర్టు  

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్​కు చెందిన ఓ యువకుడు పోటీపరీక్షల కోసం యూట్యూబ్​ చానల్​ సబ్ స్ర్కైబ్​ చేసుకున్నడు. అందులో వీడియోలు చూస్తూ ప్రిపేర్​ అయి కాంపిటీటివ్ ఎగ్జాం రాశాడు. కానీ అందులో ఫెయిల్ అయ్యాడు. చానల్​ వీడియోల మధ్య సెక్సువల్ కంటెంట్​తో కూడిన యాడ్స్​ను చూడటం వల్లే మైండ్ డైవర్ట్ అయి ఎగ్జాం సరిగ్గా రాయలేకపోయినట్లు భావించాడు. దీంతో గూగుల్ ఇండియా కంపెనీ నుంచి రూ.75 లక్షల నష్టపరిహారం ఇప్పించాలనిసుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్​ను శుక్రవారం విచారించిన జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన బెంచ్ ఆ యువకుడిపై ఫైర్ అయింది.

‘‘అడ్వర్టయిజ్మెంట్​లను చూడటం వల్ల సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయానని, మైండ్ డైవర్ట్ అయిందని అనడం సరికాదు. వాటిని చూడాలని మీకెవరూ చెప్పలేదే? ఆర్టికల్ 32 కింద దాఖలైన అత్యంత దారుణమైన పిటిషన్ ఇదే. ఇలాంటి పిటిషన్ల వల్ల విలువైన కోర్టు సమయం వృథా అవుతోంది’’ అని బెంచ్ ఆగ్రహం వ్యక్తంచేసింది. పబ్లిసిటీ కోసమే కోర్టుకు వచ్చినట్లు అనిపిస్తోందని, రూ.లక్ష ఫైన్ కట్టాలని ఆదేశించింది. దీంతో కంగు తిన్న సదరు యువకుడు.. తాను నిరుద్యోగినని, క్షమించాలని వేడుకున్నాడు. చివరకు రూ. 25 వేల ఫైన్ విధిస్తూ 
కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.