దొంగతనానికి వెళ్లి యువకుడు మృతి

దొంగతనానికి వెళ్లి యువకుడు మృతి

మోటార్​ వైరు చోరీ చేసేందుకు బావిలోకి దిగగా ప్రమాదం 

పెద్దమందడి, వెలుగు: దొంగతనానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం..వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామానికి చెందిన జక్కని శివ(22), అదే మండలం వెల్టూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ పెయింటింగ్​పని చేస్తుంటారు. ఆదివారం రాత్రి శివ పక్క గ్రామంలో పెయింటింగ్​పని ఉందని చెప్పి వెళ్లి సోమవారం సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. దీంతో అతడి తండ్రి శాంతన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా మంగళవారం శివ స్నేహితుడైన శ్రీనివాస్​ను విచారించారు. ఆదివారం రాత్రి మోజర్లకు చెందిన రఘుమారెడ్డి పొలంలోని బావి దగ్గర కరెంట్ వైర్లను చోరీ చేసేందుకు వెళ్లామని చెప్పాడు. మోటార్ వైరును తీసేందుకు బావిలోకి దిగి మునిగిపోయాడని, దీంతో తాను అక్కడి నుంచి పారిపోయి వచ్చానని తెలిపాడు. బావిలో వెతకగా శివ డెడ్​బాడీ దొరికింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు.