
వారంలోనే వస్తుంది.. తత్కాల్లో అయితే మూడ్రోజులే
ఆన్ లైన్లోనే అప్లికేషన్.. ఫీజు రూ.1,500
జిల్లాల్లోనూ ఫిజికల్ వెరిఫికేషన్
వీ6 వెలుగు ఇంటర్వ్యూలో రీజనల్ పాస్ పోర్టు ఆఫీసర్ దాసరి బాలయ్య
హైదరాబాద్, వెలుగు: పక్షి ఎగరడానికి రెక్కలు ఎంత అవసరమో, మనిషి విదేశాలకు వెళ్లడానికి పాస్పోర్టు అంతే అవసరమని రీజనల్ పాస్పోర్టు ఆఫీసర్ దాసరి బాలయ్య అన్నారు. చాలా మంది విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడే పాస్పోర్టు గురించి ఆలోచిస్తారని, ఒకవేళ సమయానికి పాస్పోర్టు రాకపోతే ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తుందని.. అందుకే ప్రతి ఒక్కరూ ముందే పాస్పోర్టు తీసుకోవాలని సూచించారు. ఒక్కసారి పాస్పోర్టు తీసుకుంటే పదేండ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. పాస్పోర్టు సేవలపై ‘వీ6 వెలుగు’తో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
ఎక్కడైనా ఫిజికల్ వెరిఫికేషన్..
పాస్పోర్టు తీసుకోవడం చాలా సులభం. ఏజెంట్లు, దళారుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. www.passportindia.gov.in వెబ్ సైట్ లో పేరు, మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. స్లాట్ ఏయే తేదీల్లో, ఏయే కేంద్రాల్లో అందుబాటులో ఉందో వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఆ రోజున ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్లతో సంబంధిత ఆఫీసుకు వెళ్లాలి. అక్కడ ఆఫీసర్లు డాక్యుమెంట్లు పరిశీలించి పాస్పోర్టు అప్రూవ్ చేస్తారు. పాస్పోర్టు కోసం పుట్టిన తేదీ, పుట్టిన స్థలాన్ని ధ్రువీకరించే డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డులో ఈ రెండూ ఉంటాయి కాబట్టి అదొక్కటి సరిపోతుంది. విద్యార్హతలు నమోదు చేసుకోవాలంటే సంబంధిత సర్టిఫికెట్లను అప్లికేషన్ టైమ్ లోనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం వచ్చేటప్పుడు ఒరిజినల్స్ తీసుకొని రావాలి. హైదరాబాద్లోని అమీర్పేట్, టోలీచౌకి, బేగంపేట్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, భువనగిరి, కామారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నల్గొండ, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ జిల్లా సెంటర్లలో సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కడైనా ఫిజికల్ వెరిఫికేషన్ కోసం హాజరు కావచ్చు.
ఎఫ్ఐఆర్ నమోదైనా ఇస్తం..
పాస్పోర్టు జారీకి 2 ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి. తీసుకునే వ్యక్తి ఇండియన్ అయి ఉండాలి. అతని మీద క్రిమినల్ కేసులు ఉండొద్దు. ఎఫ్ఐఆర్ నమోదైన పాస్పోర్టు ఇస్తాం. కానీ చార్జ్షీటు ఫైలవడం, జైలు శిక్ష పడిన వారి విషయంలో పోలీసు వెరిఫికేషన్లోనే రిజెక్ట్ అవుతుంది.
యువతే ఎక్కువ..
ఈ ఏడాది ఇప్పటికే 3.23 లక్షల మంది పాస్పోర్టు తీసుకున్నారు. వీరిలో ఎక్కువగా యువతే ఉన్నారు. ప్రస్తుతం రోజు 3 వేల మందికి పాస్పోర్టు జారీ చేస్తున్నాం. కరోనా తర్వాత ఎక్కువ మంది వస్తుండడంతో వెయిటింగ్ పీరియడ్ పెరిగింది. దాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం.
సమస్యలు ఉంటే?
పాస్పోర్టుకు సంబంధించి సమస్యలు, డౌట్లు ఉంటే సికింద్రాబాద్ లోని రీజనల్ ఆఫీస్, జిల్లాల్లోని సేవా కేంద్రాలతో పాటు వెబ్ సైట్ లోని గ్రీవెన్స్ సెల్ ద్వారా మమ్మల్ని సంప్రదించొచ్చు. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు 81214 01532 నెంబర్కు వాట్సప్లో వీడియో కాల్ చేసి కూడా నాతో నేరుగా మాట్లాడొచ్చు.
తత్కాల్లో కావాలంటే రూ.3,500
పాస్పోర్టు ఫీజు రూ.1,500 మాత్రమే. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉండి, త్వరగా కావాలంటే తత్కాల్ సేవలు వినియోగించుకోవచ్చు. ఇందుకోసం రూ.2 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లోనే కట్టొచ్చు. తత్కాల్కు పోలీస్ వెరిఫికేషన్తో పని లేకుండా వెంటనే పాస్పోర్టు ఇస్తాం. ఆ తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఏవైనా సమస్యలుంటే పాస్పోర్టు రద్దు చేసే అధికారం మాకుంటుంది. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత వారం రోజుల్లో పాస్పోర్టు ఇంటికి వచ్చేస్తుంది. ఒకవేళ తత్కాల్ లో అయితే మూడ్రోజుల్లోనే వస్తుంది. పెద్దలకు పదేండ్లు, పిల్లలకు ఐదేండ్ల వ్యాలిడిటీతో పాస్ పోర్టు ఇస్తం. వ్యాలిడిటీ ఇంకో ఏడాది ఉండగానే రెన్యూవల్ చేసుకోవాలి. 6 నెలల కంటే తక్కువ వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్టులతో విదేశాలకు వెళ్లరాదు. గడువు ముగిసినంక మూడేండ్ల లోపల కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే మాత్రం మళ్లీ పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆన్ లైన్ లోనే రెన్యూవల్ చేసుకోవచ్చు.