
వైద్యం కోసం పేదవాడు అప్పుల బారిన పడకూడదనే దివంగత, మాజీ సీఎం వైఎస్ఆర్ ఆలోచించారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. అయితే గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నీరుగార్చిందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో 42 లక్షల కుటుంబాలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చామని… రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పథకాన్ని వర్తింపజేశామని తెలిపారు. వైద్య ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామని చెప్పారు. జూలై 8 నుంచి మరో ఆరు జిల్లాలకు సేవలను విస్తరింపజేస్తామని తెలిపారు. మరో ఆరు జిల్లాల్లో దీపావళి నుంచి అమలు చేస్తామని చెప్పారు. వైద్య, ఆరోగ్య రంగాలపై ఇవాళ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వివరాలను తెలిపారు.
చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తామని చెప్పారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే భయం వేసేదని… అక్కడ ఇచ్చే మందులు పని చేయవని జనాలు అనుకునేవారని అన్నారు. కానీ, ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో మెడిసిన్స్ ఇస్తున్నామని చెప్పారు. ప్రజలు ధైర్యంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి …వైద్యం చేయించుకోవచ్చని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.5 నుంచి రూ. 10 వేల వరకు పెన్షన్లను ఇస్తున్నామని చెప్పారు. క్యాన్సర్ రోగులకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామని తెలిపారు సీఎం జగన్.