అభినందన్‌కు అరుదైన అవార్డ్

అభినందన్‌కు అరుదైన అవార్డ్

నాసిక్‌: పాక్‌ అదుపులో నుంచి తిరిగొచ్చిన భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌కు ‘భగవాన్‌ మహవీర్‌ అహింసా పురస్కార్’ అనే అవార్డును అందిస్తున్నట్లు ‘అఖిల భారతీయ దిగంబర జైన మహాసమితి’ ప్రకటించింది. ఈ మేరకు దిల్లీలోని సంస్థ ఛైర్‌పర్సన్‌ మహింద్ర జైన్‌ ప్రకటన చేసినట్లు సంస్థ మహారాష్ట్ర కన్వీనర్‌ పరాస్‌ లొహాడే తెలిపారు. ఈ అవార్డును అందుకుంటున్న మొట్టమొదటి వ్యక్తి అభినందన్‌ కావడం విశేషం. ఈ సంవత్సరమే స్థాపించిన ఈ అవార్డు కింద రూ.2.51లక్షల నగదుతో పాటు జ్ఞాపికను అందజేస్తారు. ఏప్రిల్‌ 17న వర్ధమాన మహావీర జయంతి సందర్భంగా ఈ అవార్డును అభినందన్‌కు అందజేయనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.

భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన పాక్‌ యుద్ధ విమానాలను కూల్చే క్రమంలో అభినందన్‌ పాక్‌ సైన్యానికి చిక్కిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు పాక్‌ అదుపులో ఉన్న ఆయన తిరిగి శుక్రవారం సాయంత్రం మాతృదేశంలోకి అడుగుపెట్టారు. శత్రుదేశం చెరలో ఉన్నా..అభినందన్‌ చూపిన తెగువను యావత్‌ భారత్ ప్రశంసించింది.