
- సజ్జనార్ బయటికి రావాలంటూ నినాదాలు
- నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
ముషీరాబాద్,వెలుగు: పెంచిన బస్ పాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాది మందితో మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ర్యాలీగా వెళ్లి బస్ భవన్ ను ముట్టడించారు. ప్రభుత్వానికి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేం లోపలికి రావాలా... సజ్జనార్ బయటకు వస్తారా అంటూ ఏబీవీపీ నాయకులు నినాదాలు చేశారు.
పోలీసులు, లీడర్లకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకోవడతో వారిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు పృథ్వీతేజ, అలివేలు రాజు, ఝాన్సీ, శ్రీరామ్, కళ్యాణి మాట్లాడుతూ.. ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్ చార్జీలు ఆకాశాన్ని అంటుతున్నాయని, మళ్ళీ చార్జీలు పెంచడం సరికాదని అన్నారు. ఫ్రీ బస్ కారణంగా సరిపడా బస్సులు లేక స్టూడెంట్లు ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాత బస్ పాస్ చార్జీలనే యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్యాంకిరణ్, మహేశ్, హరిప్రసాద్, శివకృష్ణ, అఖిల్, బాలు, నగేశ్, గోపాల్, భరత్, దృహన్ తదితరులు పాల్గొన్నారు.