- ఛత్రినాకలోని ఇల్లు, నారాయణగూడలోని ఆఫీస్లో ఏసీబీ సోదాలు
- ఇంటి బెడ్రూమ్లో నోట్ల కట్టలు.. రూ.1.54 కోట్లు, కిలో బంగారం సీజ్
- రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూములు, గచ్చిబౌలిలో బిల్డింగ్స్, ఫ్లాట్స్
- నరహరి అరెస్ట్..
హైదరాబాద్, వెలుగు: ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరికి ఏసీబీ స్పెషల్ కోర్టులో14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.
ఆర్ అండ్బీ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) జరుపుల మోహన్నాయక్ తరహాలోనే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ల్యాండ్ అండ్ సర్వే మల్టీజోన్2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావును ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. పాతబస్తీ ఛత్రినాకలోని ఆయన ఇల్లు సహా కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లు సహా 12 ప్రాంతాల్లో మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నరహరి ఇంటి బెడ్రూమ్లోని బీరువా పైన కప్బోర్డులో రూ.1.54 కోట్ల నగదు, 1.3 కిలోల బంగారం దొరికింది. వీటితోపాటు బ్యాంక్ బ్యాలెన్స్రూ.2.29 కోట్లు, రూ.5.04 కోట్ల ఫిక్స్డ్డిపాజిట్లు స్వాధీనం చేకున్నారు.
సైబరాబాద్లో బిల్డింగులు, ఆపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, భార్య పేరిట రెండు బ్యాంక్ లాకర్లు గుర్తించారు. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న కుమారుడు, అత్తమామల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తుల డాక్యుమెంట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత మార్కెట్వ్యాల్యూ ప్రకారం ఈ ఆస్తుల విలువ సుమారు రూ.180 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నరహరిని అరెస్ట్చేసి.. ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరచగా 14 రిమాండ్ విధించారు.
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్
సర్వేయర్గా అవినీతి, అక్రమాలు
హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఛత్రినాకకు చెందిన సుంకరి నరహరిరావు తండ్రి యాదవరావు నారాయణగూడలోని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్లో కంప్యూటర్ డ్రాఫ్ట్మెన్గా పనిచేసేవాడు. ఆయన 1984 డిసెంబర్లో మృతి చెందగా.. అప్పటికే ఇంటర్ చదువుతున్న నరహరిరావుకు 1987 సెప్టెంబర్లో ఉద్యోగం వచ్చింది. కొంతకాలం తర్వాత రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఆఫీస్లో డిప్యూటీ సర్వేయర్గా పదోన్నతి లభించింది. నాటి నుంచి 2001 వరకు రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నరహరిరావు పనిచేశాడు. అనంతరం 2008 వరకు హైదరాబాద్లో సర్వేయర్గా విధులు నిర్వహించాడు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఆఫీస్లో డిప్యూటీ ఇన్స్టెక్టర్గా, మహబూబ్నగర్, వరంగల్లో 2013 వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. 2016 నుంచి 2020 వరకు సర్వే అండ్ ల్యాంగ్ రికార్డ్స్లో విధులు నిర్వహించాడు. నిరుడు ఆగస్టులో మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి పొందాడు. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల సర్వేలకు సంబంధించి నరహరిపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో భూముల అమ్మకాలకు సంబంధించిన సర్వేల సమయంలోను భారీగా అవకతవకలకు పాల్పడినట్టు తెలిసింది. ఇందులో భాగంగా నరహరికి ఇటీవల పెద్ద మొత్తంలో నగదు చేరినట్టు ఏసీబీకి సమాచారం అందింది.
నారాయణగూడలోని ఆఫీసులో పత్రాలు స్వాధీనం
నరహరి రావు కార్యకలాపాలు, ఆర్థికపరమైన పూర్తి ఆధారాలు సేకరించిన అనంతరం ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. డీఎస్పీలు శ్రీధర్, శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఛత్రినాక, నారాయణగూడలో నరహరిరావు నివాసం, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. ఛత్రినాకలోని నరహరిరావు నివాసంతో పాటు ఆయన సోదరులు, బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించారు. నరహరిరావుతో ఆయన సోదరులకు, తల్లికి ఎలాంటి సంబంధం లేదని గుర్తించారు. నారాయణగూడలోని ఆయన కార్యాలయంలో తనిఖీలు చేశారు. సిబ్బంది వద్ద వివరాలు సేకరించారు. ఇటీవలి కాలంలో ఆయన కార్యాలయం నుంచి జరిగిన కార్యకలాపాల గురించి ఆరా తీశారు.
పలు అనుమానిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సర్వీస్ రికార్డ్ ప్రకారం.. నరహరిరావు ఉద్యోగంలో చేరక ముందు ఆయన ఆస్తులు.. ఉద్యోగంలో చేరిన తర్వాత జీతం, ఖర్చులు పోను మిగులు సహా పూర్తి సమాచారం సేకరించారు. ఈ మేరకు ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే నరహరి రావుపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. బుధవారం రిమాండ్చేసిన అనంతరం రెండు బ్యాంక్ లాకర్లను కోర్టు అనుమతి మేరకు ఓపెన్ చేయనున్నట్టు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. లాకర్లలో మరికొన్ని ఆస్తుల డాక్యుమెంట్లు లభించే అవకాశం ఉందని వెల్లడించారు.
ఛత్రినాకలో ఇల్లు, గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో బిల్డింగ్
- రంగారెడ్డి జిల్లాలో ఐదు ఓపెన్ ప్లాట్లు
- మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి
- పుప్పాలగూడలో హైరైజ్ బిల్డింగ్(2,500 ఎస్ఎఫ్టీ)
- నార్సింగిలో రెండు హైరైజ్ బిల్డింగ్స్(ఒక్కోటి 1,860 ఎస్ఎఫ్టీ)
- రాజేంద్రనగర్లో రెసిడెన్షియల్ ఫ్లాట్
