
- ఏసీబీ దాడుల్లో ఎలక్ట్రిసిటీ ఏడీఈ అంబేద్కర్ అక్రమాస్తుల గుట్టు రట్టు
- హైదరాబాద్ సహా ఐదు జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు
- బినామీ, బంధువు సతీశ్ ఇంట్లో రూ.2.18 కోట్ల నగదు స్వాధీనం
- కారులో రూ.5.5 లక్షలు, బ్యాంక్ అకౌంట్లలో రూ.77 లక్షల క్యాష్ సీజ్
- గచ్చిబౌలిలో ఐదంతస్తుల భవనం.. పది ఎకరాల్లో కెమికల్ కంపెనీ
- నిందితుడి అరెస్ట్.. నేడూ కొనసాగనున్న సోదాలు
హైదరాబాద్, వెలుగు: ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్(ఏడీఈ) అంబేద్కర్ను మంగళవారం ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించి వందల కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించింది. ఏడీఈ ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.300 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. ఈ మేరకు ఏసీబీ డీజీ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. గచ్చిబౌలికి చెందిన ఇరుగు అంబేద్కర్ టీజీఎస్పీడీసీఎల్ ఇబ్రహీంబాగ్ ఆపరేషన్స్ ఏడీఈగా పని చేస్తున్నాడు. ఏడీఈగా అధికారాన్ని అడ్డంపెట్టుకుని పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నాడని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. బాధితుల ఆధా రంగా ఏసీబీ అధికారులు వివరాలు సేకరించి ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. సెర్చ్ వారెంట్తో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సోదాలు చేశారు. హైటెక్ సిటీ ఖానామెట్లోని మాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 307లోని అంబేద్కర్ ఇంటితోపాటు మెదక్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలోని పది ప్రాంతాల్లో ఆయ న బంధువుల ఇండ్లలోనూ సోదాలు నిర్వహించారు.
నేడు కూడా కొనసాగనున్న సోదాలు..
అంబేద్కర్ నివాసంలో కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బినామీల పేర్లతో ఉన్న ఆస్తుల పత్రాలను సీజ్ చేశారు. పటాన్చెరులోని అంబేద్కర్ బినామీగా ఉన్న అతని బంధువు సతీష్ ఇంట్లో రూ.2.18 కోట్ల నగదు, అంబేద్కర్ కారులో రూ. 5.50 లక్షలు క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. శేరిలింగంపల్లిలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో జీ ప్లస్ 5 భవనం, హైదరాబాద్లోని పలు కీలక ప్రాంతాల్లో ఆరు నివాస స్థలాల డాక్యుమెంట్లను సీజ్ చేశారు. అంబేద్కర్ పేరిట పది ఎకరాల్లో అమ్తర్ పేరిట ఒక కెమికల్ కంపెనీ, నల్లగొండ జిల్లా పెన్పహాడ్లో వ్యవసాయ భూమి, రెండు కార్లు, బ్యాంకు ఖాతాల్లో రూ.77 లక్షల నగదు, పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.300 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. కాగా, హైదరాబాద్తోపాటు నల్లగొండ, సూర్యాపేట, మెదక్ జిల్లాల్లో కొనసాగిన సోదాల్లో పట్టుబడిన ఆస్తుల వివరాలు ఏసీబీ అధికారులు వెల్లడించలేదు. సోదాలు బుధవారం కూడా కొనసాగనున్నాయి.
సహకరించిన వారిపైనా చర్యలు: ఆనంద్, ఏసీబీ డీఎస్పీ
ఏడీఈ అంబేద్కర్ పై అవినీతి ఆరోపణలు రావ డంతో పూర్తి స్థాయిలో విచారణ అనంతరం మంగళవారం ఏక కాలంలో సోదాలు చేపట్టా మని ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్ మీడి యాకు తెలిపారు. అంబేద్కర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్టు చేశా మని, అంబేద్కర్ కు సహకరించిన వారిపైనా దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామన్నా రు. అంబేద్కర్ నివాసంతో పాటు ఆయన సన్నిహితులు, సహకరిస్తున్న వారి నివాసాల్లో నూ సోదాలు కొనసాగుతున్నట్టు తెలిపారు.