హనుమకొండ, వెలుగు : హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జి డీఈవో ఎ.వెంకట్రెడ్డి ఏసీబీకి చిక్కాడు. ఓ ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ రెన్యూవల్ చేసేందుకు రూ. లక్ష డిమాండ్ చేయగా.. డీఈవో ఆఫీస్ సిబ్బంది ద్వారా రూ.60 వేలు తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... హనుమకొండ కొత్తూరుజెండా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ రెన్యూవల్ కోసం కరస్పాండెంట్ గత నెలలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నాడు.
నెల గడిచినా పర్మిషన్ రాకపోవడంతో సదరు స్కూల్ కరస్పాండెంట్ డీఈవో ఆఫీస్కు వెళ్లి సీనియర్ అసిస్టెంట్ ఎండీ.గౌస్, జూనియర్ అసిస్టెంట్ కన్నెబోయిన మనోజ్ను కలిశాడు. దీంతో వారు ఇన్చార్జి డీఈవోగా పనిచేస్తున్న అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డికి విషయం చెప్పారు. పర్మిషన్ ఇచ్చేందుకు రూ. లక్ష డిమాండ్ చేయడంతో ఆ విషయాన్ని సిబ్బంది కరస్పాండెంట్కు చెప్పారు. దీంతో అతడు అడిషనల్ కలెక్టర్ను కలిసి అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడడంతో.. తాను డీఈవో ఆఫీస్ సిబ్బందికి చెబుతానని అడిషనల్ కలెక్టర్ సమాధానం ఇచ్చారు.
తర్వాత రెండు రోజులైనా పర్మిషన్ రాకపోవడంతో కరస్పాండెంట్ మరోసారి అడిషనల్ కలెక్టర్ను సంప్రదించగా.. రూ. 60 వేలకు ఒప్పుకున్నారు. తర్వాత సదరు కరస్పాండెంట్ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో శుక్రవారం రూ. 60 వేలు తీసుకొని డీఈవో ఆఫీస్ వద్దకు వెళ్లగా.. అక్కడ ఉన్న జూనియర్ అసిస్టెంట్ మనోజ్ అడిషనల్ కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి విషయం చెప్పాడు. అనంతరం మనోజ్ కలెక్టరేట్ వెనుక వైపు సీసీ కెమెరాలు పనిచేయని చోటుకు కరస్పాండెంట్ను తీసుకెళ్లి డబ్బులు తీసుకొని, అడిషనల్ కలెక్టర్కు విషయం చెప్పాడు. అప్పటికే కలెక్టరేట్కు చేరుకున్న ఏసీబీ ఆఫీసర్లు అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్, సీనియర్ అసిస్టెంట్ గౌస్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ముగ్గురినీ శనివారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ సాంబయ్యవివరించారు.
మంచిర్యాల జిల్లాలో విలేజ్ సెక్రటరీ
బెల్లంపల్లి, వెలుగు : ఇందిరమ్మ ఇంటి మూడో విడత బిల్లు కోసం రూ. 5 వేలు తీసుకున్న మంచిర్యాల జిల్లా కన్నెపల్లి విలేజ్ సెక్రటరీ రాజ్కుమార్ను ఏసీబీ పట్టుకున్నారు. ఏసీబీ ఆదిలాబాద్ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నెపల్లికి చెందిన ఓ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు మూడో విడత బిల్లు కోసం విలేజ్ సెక్రటరీ రాజ్కుమార్ను కలిశాడు. దీంతో సెక్రటరీ రూ. 10 వేలు లంచం డిమాండ్ చేయగా.. లబ్ధిదారులు రూ.5 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. తర్వాత ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో శుక్రవారం రాత్రి బెల్లంపల్లి కాంటా చౌరస్తా వద్ద సెక్రటరీని కలిసి రూ. 5 వేలు ఇచ్చాడు. దీంతో ఏసీబీ ఆఫీసర్లు సెక్రటరీ రాజ్కుమార్ను
రెడ్హ్యాండెడ్గాపట్టుకున్నారు.
ఆర్టీఐ కింద వివరాలు ఇచ్చేందుకు..
చండూరు, వెలుగు : సమాచార హక్కు చట్టం కింద వివరాలు ఇచ్చేందుకు లంచం తీసుకున్న చండూరు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తండ్రికి సంబంధించిన భూమిలో కొంత భాగం మరొకరి పేరున రిజిస్ట్రేషన్ అయింది. విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి ‘మాకు సంబంధించిన భూమి మరొకరి పేరున ఎలా రిజిస్టర్ అయింది.. ఆ వివరాలు చూపండి’ అంటూ రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో బాధితుడు.. రిజిస్ట్రేషన్ వివరాలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు.
దీంతో మ్యుటేషన్ ప్రొసీడింగ్స్, ఇతర పేపర్స్ను అందజేసేందుకు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ రూ. 50 వేలు డిమాండ్ చేయగా.. రూ. 20 వేలకు ఒప్పుకున్నాడు. దీంతో బాధితుడు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో గురువారం రాత్రి డబ్బులు ఇచ్చేందుకు డిప్యూటీ తహసీల్దార్కు ఫోన్ చేయగా.. హైదరాబాద్లోని బాలాపూర్ చౌరస్తా వద్దకు రావాలని సూచించాడు. దీంతో బాధితుడు అక్కడికి వెళ్లి డిప్యూటీ తహసీల్దార్కు డబ్బులు ఇచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
