లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగజ్యోతి ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ. 15 కోట్ల ఆస్తులను గుర్తించినట్లుగా తెలిపారు. జ్యోతి ఇంట్లో 65 లక్షల రూపాయల నగదుతో పాటు నాలుగు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆమె పేరిట ఓపెన్ ప్లాట్లు.. హైదరాబాద్ లో ఓ ఫ్లాట్, వ్యవసాయ భూములను సైతం అధికారులు గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ దాదాపుగా రూ. 15 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు తేల్చారు.
ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) గా పనిచేస్తుంది జగ జ్యోతి. బిల్డింగ్ కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేలు లంచం తీసుకుంటూ సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. కాగా, జగజ్యోతిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్విధించింది. అనంతరం ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో తనకు ఛాతిలో నొప్పి వస్తుందంటూ జ్యోతి చెప్పడంతో ఆమెను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. రేపు ఉదయం జ్యోతిని డిశ్చార్జ్ చేస్తామన్నారు వైద్యులు. డిశ్చార్జ్ అనంతరం జగజ్యోతిని కోర్టులో హాజరుపరుచనున్నారు ఏసీబీ అధికారులు.
నిజామాబాద్ జిల్లా నామ్దేవ్వాడకు చెందిన కాంట్రాక్టర్ బొడుకం గంగన్న డిపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్స్ వర్క్స్ చేస్తుండేవాడు. ఆయన గాజులరామారంలోని జువెనల్ బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ పనులు చేయించాడు. ఇందుకు సంబంధించిన బిల్స్ జగజ్యోతి ఆఫీస్లో దాఖలు చేశాడు. బిల్స్ సాంక్షన్ చేయించుకునేందుకు జగ జ్యోతిని కలిశాడు. దీంతో పెండింగ్ బిల్స్ క్లియర్ చేసేందుకు జగ జ్యోతి రూ.84 వేల లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ముందుస్తు ప్లాన్ ప్రకారం అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.