ఏసీబీ వలలో అవినీతి ఉద్యోగులు.. హుజూర్ నగర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, సుల్తానాబాద్లో..

ఏసీబీ వలలో అవినీతి ఉద్యోగులు.. హుజూర్ నగర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, సుల్తానాబాద్లో..

హుజూర్ నగర్/సుల్తానాబాద్, వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్  తహసీల్దార్  ఆఫీస్ లో రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా, భూభారతి డేటా ఎంట్రీ ఆపరేటర్​ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నల్గొండ ఏసీబీ డీఎస్పీ జగదీశ్​చందర్​ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కరక్కాయల గూడెం గ్రామానికి చెందిన తోట రాంబాబుకు 12 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. ఈ భూమికి సంబంధించిన ప్రొసీడింగ్ ఇచ్చేందుకు భూభారతి  డేటా ఎంట్రీ ఆపరేటర్  కర్నాటి విజేతారెడ్డి రూ.20 వేలు డిమాండ్  చేశాడు. రూ.12 వేలు ఇస్తానని ఒప్పుకున్న రైతు, ఏసీబీ అధికారుల సూచన మేరకు శనివారం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్  హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విజేతా రెడ్డిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. 

సుల్తానాబాద్లో..
కొత్త ఇంటికి నంబర్  కేటాయించేందుకు లంచం తీసుకుంటూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​ మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కరీంనగర్  ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్  తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్  పట్టణంలోని బస్టాండ్  వెనక ఆర్నకొండ ప్రసాద్ కొత్త ఇంటిని కట్టుకున్నాడు. ఈ ఇంటికి నంబర్​ కేటాయించాలని మున్సిపల్​ ఆఫీస్​ చుట్టూ ఏడాదిగా తిరుగుతున్నాడు. 

రూ.5 వేలు ఇస్తేనే ఇంటి నంబర్​ ఇస్తామని ఆర్ఐ వినోద్ కుమార్, బిల్ కలెక్టర్ విజయ్  చెప్పడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు పట్టణంలోని ఒక షాపులో రూ.5 వేలు ఇవ్వగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిని కరీంనగర్  ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు.