- సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరికి 7 బ్యాంక్ అకౌంట్లు, 2 లాకర్లు
- లాకర్లలో రూ.1.5 కోట్ల డబ్బు, రెండున్నర కిలోల బంగారం
- ఇన్కమ్ ట్యాక్స్కు చిక్కకుండా ప్రైవేటు సొసైటీల్లో 3.5 కోట్ల ఎఫ్డీలు
- వాటిపై ఏటా 12 శాతం వడ్డీ సేకరణ
- వెంచర్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల ఎన్వోసీకి రూ.10 లక్షలు వసూలు
- బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ రూ.200 కోట్లపైనే!
హైదరాబాద్, వెలుగు: సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ మల్టీజోన్-–2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావు అక్రమాస్తుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్విన కొద్దీ లెక్క లేనన్ని ఆస్తులు బయటపడుతున్నాయి. దర్యాప్తులో భాగంగా శనివారం పాతబస్తీ శాలిబండ కెనరా బ్యాంక్లోని రెండు లాకర్లు ఓపెన్ చేసిన ఏసీబీ అధికారులు.. ఒక దాంట్లో నోట్ల కట్టలు, మరొక దాంట్లో రెండున్నర కిలోలకు పైగా బంగారు ఆభరణాలు చూసి అవాక్కయ్యారు.
నరహరితోపాటు ఆయన భార్య పేరిట ఉన్న జాయింట్ అకౌంట్ లాకర్లో రూ.1.5 కోట్ల నగదు, భార్య లాకర్లో ఒక్కొక్కటి100 గ్రాముల బరువున్న 12 బంగారు బిస్కెట్లు సహా మొత్తం 2,600 గ్రాముల బంగారం, వజ్రాభరణాలను సీజ్ చేశారు. నరహరి ఇళ్లలో జరిపిన సోదాల్లో ఇప్పటికే రూ.1.54 కోట్ల నగదు సహా మొత్తంగా రూ.13.5 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించిన సంగతి తెలిసిందే. కాగా లాకర్లలో గుర్తించిన నగదు, బంగారంతో అధికారిక లెక్కల ప్రకారం రూ.17 కోట్లకు పైగా నరహరి రావు ఆస్తులు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుంది.
అక్రమ సంపాదన కోసం ఏకంగా 17 బ్యాంక్ అకౌంట్లను నిర్వహిస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇందులో 10 అకౌంట్లు నరహరి పేరిట మరో 7 బ్యాంక్ అకౌంట్లు భార్య, కొడుకు, కూతురు పేరిట ఓపెన్ చేసినట్లు వెల్లడైంది. వీటిలో నరహరి జీతం డబ్బు డిపాజిట్ అయ్యే సాలరీ అకౌంట్లో రూ.1.5 కోట్లు బ్యాలెన్స్ ఉండగా ఏసీబీ సీజ్ చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకునేందుకు ఓ ప్రైవేట్ సొసైటీలో గతేడాది జులైలో రెండు రోజుల్లోనే రూ.3.5 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూసింది. ఎఫ్డీలకు గాను సంవత్సరానికి 12 శాతం వడ్డీ తీసుకుంటున్నట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది.
ఎన్వోసీకి రూ.10 లక్షలకుపైగా వసూలు
మల్టీజోన్–2 పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ జిల్లా సహా గ్రేటర్ పరిధిలోని భూములు వస్తాయి. ఇందులో గేటెడ్ కమ్యూనిటీలు, వెంచర్లు, విల్లాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ భూములను నిర్ధారించడంలో డిప్యూటీ డైరెక్టర్గా నరహరి జారీ చేసే ఎన్వోసీ తప్పనిసరి. వీటితో పాటు భూములకు బౌండరీల నిర్ధారణ, ప్రాజెక్టులకు భూసేకరణ సహా పరిశ్రమలకు భూకేటాయింపుల విషయంలో అనుమతుల కోసం పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందినట్లు తెలిసింది.
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు సంబంధించి ఎలాంటి పనులకైనా సరే రూ.10 లక్షలకు తగ్గకుండా లంచం వసూలు చేసేవాడిన ఏసీబీ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిసింది. నగదు రూపంలోనే లంచం తీసుకునే వాడని.. ఇతర రూపాల్లో నిరాకరించేవాడని సమాచారం.
