చార్మినార్, వెలుగు: ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ విస్తరణ పనుల్లో వేగం పెంచాలని హెచ్ఎంఆర్ఎల్, హామ్లా అడిషనల్మేనేజింగ్ డైరెక్టర్ బి.అజిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం దారుషాఫా నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న 7.5 కిలోమీటర్ల ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్లో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి, రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఈ మార్గంలో మొత్తం 888 ప్రభావిత ఆస్తులకు గానూ ఇప్పటికే 833 ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
మిగిలిన 55 ఆస్తుల్లోని పురాతన భవనాలు, వారసత్వ కట్టడాల పరిధిలో చేపట్టాల్సిన పనులపై అడిషనల్ ఎండీ చర్చించారు. విద్యుత్ లైన్లు, తాగునీటి పైప్లైన్లు వంటి యుటిలిటీలను ఎటువంటి అడ్డంకులు లేకుండా వేగంగా వేరే ప్రాంతాలకు తరలించాలని సూచించారు. భూసేకరణ పూర్తయిన ఆస్తులను త్వరగా తొలగించాలని చెప్పారు. మెట్రో చీఫ్ ఇంజినీర్ ఎస్.భాస్కర్ రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
