బెంగళూరు: శ్రీలంకతో రెండు టెస్ట్ల సిరీస్ ముగిసిన 48 గంటల్లోనే టీమిండియా స్టార్ క్రికెటర్లు కఠినమైన ఫిట్నెస్ పరీక్షకు హాజరయ్యారు. డొమెస్టిక్ సీజన్ నేపథ్యంలో శనివారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో నిర్వహించిన ఈ పరీక్షల్లో సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లందరూ పాల్గొన్నారు. 2027 ఐపీఎల్ ముగిసేవరకు ఎనిమిది నెలల పాటు సుదీర్ఘమైన షెడ్యూల్ ఉన్నందున టెస్ట్ జట్టు రెగ్యులర్ ప్లేయర్లు వెంటనే ఫిట్నెస్ పరీక్షల్లో పాల్గొన్నారు. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఓపెన్ యశస్వి జైస్వాల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఇందులో ఉన్నారు.
తప్పనిసరి ఫిట్నెస్ పరీక్షల్లో బ్రాంకో టెస్ట్, 2 వేల మీటర్ల పరుగు, యోయో టెస్ట్, వికెట్ల మధ్య పరుగు వంటి క్రికెట్ సంబంధిత డ్రిల్స్ ఉన్నాయి. ఫిట్నెస్ టెస్ట్కు కొలమానంగా గుర్తించే బ్రాంకో టెస్ట్లో 0 నుంచి 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్ల దూరంలో కోన్లను ఉంచుతారు. ప్లేయర్లు 0 నుంచి 20 మీటర్ల వరకు పరుగెత్తి రావాలి. అలాగే 40, 60 మీటర్లు పూర్తి చేయాలి. ఇలా విరామం లేకుండా ఐదు సెట్ల (1200 మీటర్లు)ను ఐదున్నర నిమిషాల్లో పూర్తి చేయాలి. యోయో టెస్ట్ మార్క్ 16.5 పాయింట్లను అందుకోవాలి. 2 వేల మీటర్ల రన్ను 10 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
