భద్రాచలం వద్ద ఇరిగేషన్‌‌ ఆధ్వర్యంలో రూ.49 కోట్లతో పుష్కర ఘాట్లు

భద్రాచలం వద్ద ఇరిగేషన్‌‌ ఆధ్వర్యంలో రూ.49 కోట్లతో  పుష్కర ఘాట్లు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద ఇరిగేషన్‌‌ ఆధ్వర్యంలో రూ.49 కోట్లతో మూడు దశల్లో పుష్కర ఘాట్ల పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్‌‌ అంకిత్‌‌ తెలిపారు. శనివారం గోదావరి స్నానఘట్టాల సమీపంలో నూతన స్నానఘట్టాలు, కరకట్టపై రోడ్డు విస్తరణ పనులకు వారు భూమిపూజ చేశారు. 2027 గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. తొలి విడతలో రూ.46.65 కోట్లు, రెండో విడతలో రూ.1.75 కోట్లు, మూడో విడతలో రూ.60 లక్షలతో పనులు చేపడుతున్నట్లు వివరించారు. 

వచ్చే ఏడాది మార్చిలోపు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. భద్రాచలం అనంతరం దుమ్ముగూడెం, బూర్గంపాడు, ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పుష్కర ఘాట్ల పనులు చేపడతామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో దామోదర్‌‌రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఇరిగేషన్‌‌ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.