ఖమ్మం టౌన్, వెలుగు: 22ఏ నిషేధిత భూముల సమస్యల పరిష్కారంలో అధికారులు పకడ్బందీగా వ్యవహరించాలని ఖమ్మం కలెక్టర్ దివాకర ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస్రెడ్డితో కలిసి రెవెన్యూ ఆఫీసర్లతో 22ఏ భూముల సమస్యలపై సమీక్ష నిర్వహించారు.
జిల్లావ్యాప్తంగా 22ఏ భూముల పరిశీలన, నమోదు, తొలగింపునకు ఒకే విధమైన ఫార్మాట్ రూపొందించాలని ఆదేశించారు. ప్రైవేట్ భూములు పొరపాటున 22ఏ జాబితాలో ఉన్నట్టు తేలితే, సర్వే నంబర్ వారీగా డిలీటెడ్ లిస్ట్ రూపొందించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని తెలిపారు.
అనంతరం సర్వేయర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు, లైసెన్స్డ్ సర్వేయర్లకు డేటా ఎంట్రీ విధానంపై అవగాహన కల్పించారు. కూసుమంచి మండలం భగత్వీడు గ్రామంలో చేపడుతున్న రీ-సర్వే డేటా ఎంట్రీని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
