ఖమ్మం టౌన్/భద్రాద్రికొత్తగూడెం/జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: తమ సమస్యలు, హక్కుల సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం ధర్నాకు దిగాయి. ఉద్యోగుల హక్కులు, ఆర్థిక, సర్వీస్ ప్రయోజనాల సాధన కోసం తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజీ ఏజేఏసీ) ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉద్యోగులు, టీచర్లు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఖమ్మంలో నిర్వహించిన మహాధర్నాకు టీజీఈజేఏసీ ఖమ్మం జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, జిల్లా కన్వీనర్ కొంగర వెంకటేశ్వరరావు సమన్వయం చేశారు. వివిధ భాగస్వామ్య ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్లో జేఏసీ చైర్మన్ అమరనేని రామారావు, కన్వీనర్ వెంకటపుల్లయ్య ఆధ్వర్యంలో భూపాలపల్లిలో టీజీజేఏసీ చైర్మన్ బూరుగు రవి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది
హనుమకొండ, వెలుగు: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలో తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై సీఎంతో చర్చించిన తర్వాతే తాను ధర్నా కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లయిన రెండో పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు– ఓపీఎస్ పునరుద్ధరణ, పెండింగ్ డీఏల మంజూరు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం తదితర అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.
