రూ. 31 కోట్ల విలువైన వడ్లు మాయం.. భువనగిరి, యాదాద్రి జిల్లాలోని మిల్లుల్లో మాయమైనట్లు గుర్తింపు

రూ. 31 కోట్ల విలువైన వడ్లు మాయం.. భువనగిరి, యాదాద్రి జిల్లాలోని మిల్లుల్లో మాయమైనట్లు గుర్తింపు

జనగామ, వెలుగు: సీఎంఆర్‌‌ పెండింగ్‌‌పై సివిల్‌‌ సప్లై డిపార్ట్‌‌మెంట్‌‌ సీరియస్‌‌గా దృష్టి పెట్టింది. బకాయిలు ఉన్న మిల్లులపై విజిలెన్స్‌‌, స్టేట్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌‌ టీమ్స్ వరుసగా దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఓ మిల్లర్‌‌ను నెల రోజుల వ్యవధిలోనే ఇటు యాదాద్రి, అటు జనగామ జిల్లాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనంతారంలోని యాదాద్రి రైస్‌‌ మిల్లులో నూనె వెంకటేశ్వర్లు, రామ్మోహన్ తో పాటు మరికొందరు భాగస్వాములు ఉన్నారు.

జులైలో ఆఫీసర్లు నిర్వహించిన తనిఖీల్లో 6,668 టన్నుల వడ్లు కనిపించలేదు. 2022-23 యాసంగి టెండర్‌‌ బకాయిలతో కలిపి సుమారు రూ.24 కోట్లు సివిల్‌‌ సప్లై శాఖకు చెల్లించాల్సి ఉన్నట్లు గుర్తించారు. దీంతో నూనె వెంకటేశ్వర్లు, ఇతర భాగస్వాములకు సంబంధించిన ఆస్తులను సీజ్ చేయించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భువనగిరి పోలీసులు వెంకటేశ్వర్లును అరెస్ట్‌‌ చేశారు. అనంతరం బెయిల్‌‌పై బయటకు వచ్చారు.

జనగామలో మరో కేసు..
జనగామ జిల్లా నెల్లుట్లలోని మణికంఠ రైస్‌‌ మిల్లులో 11 మంది భాగస్వాములు ఉన్నారు. వీరిలో యాదాద్రి జిల్లాలోని రైస్‌‌ మిల్లులో భాగస్వాములుగా ఉన్న నూనె వెంకటేశ్వర్లు, రామ్మోహన్‌‌ సైతం ఉన్నారు. ఈ మిల్లుకు సంబంధించి రూ.3.70 కోట్ల బకాయిలతో పాటు 2022-23 ఆక్షన్‌‌ ప్యాడీకి సంబంధించిన  1,526 టన్నులు, 2024-25 సీజన్‌‌కు సంబంధించిన 995 టన్నులకుపైగా వడ్లకు సంబంధించి మొత్తం సుమారు రూ.7 కోట్లు సివిల్‌‌ సప్లై శాఖకు  చెల్లించాల్సి ఉంది.

మిల్లుకు షోకాజ్‌‌ నోటీసులు జారీ చేసినా స్పందన రాకపోవడంతో అధికారులు చర్యలకు దిగారు. జనగామ జిల్లా లింగాలఘణపురం పోలీసులు ఈ నెల 22న యాదాద్రి జిల్లా భువనగిరిలో వెంకటస్వామిని అరెస్ట్‌‌ చేశారు. విచారణ అనంతరం మంగళవారం రిమాండ్‌‌కు తరలించారు. నూనె వెంకటేశ్వర్లు భాగస్వామిగా ఉన్న రెండు మిల్లుల్లో కలిపి సుమారు రూ.31 కోట్ల విలువైన వడ్లు దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు.

రూ.6.46 కోట్ల సీఎంఆర్ డీఫాల్ట్.. మిల్లు నిర్వాహకురాలి అరెస్ట్
మహబూబాబాద్, వెలుగు: సీఎంఆర్ డీఫాల్ట్ కేసులో ఓ మిల్లు నిర్వాహకురాలిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని భుక్యారాంతండా శివారులోని మహాదేవ ఆగ్రో ఇండస్ట్రీస్ పేరుతో మిల్లు నిర్వహిస్తున్నారు.

ఈ మిల్లులో వరంగల్ విజిలెన్స్, ఎన్ పోర్స్ మెంట్, జిల్లా సవిల్​సప్లై అధికారులు దాడులు చేయగా.. 2023=24 ఖరీఫ్ సీజన్ కు చెందిన రూ. 6.46 కోట్ల విలువైన 1,586.714 టన్నుల వడ్లు మాయమైనట్లు తేలింది. దీంతో మిల్లు నిర్వాహకురాలు సుభాషిణిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.