- బీట్ ఆఫీసర్మృతి నేపథ్యంలో ఫారెస్ట్ శాఖ హైఅలర్ట్
- కరెంట్ వైర్ ఉచ్చుల ఓల్టేజీ చెకింగ్ కోసం ఎక్విప్మెంట్ కొనుగోలుకు నిర్ణయం
- ఎన్పీడీసీఎల్, పోలీస్శాఖలతో ఫారెస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్లు
- డ్రోన్లతోనూ ఫారెస్ట్ పర్యవేక్షణ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: నిత్యం అడవుల్లో విధులు నిర్వహించే ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బంది రక్షణపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. వేటగాళ్లు అమర్చిన కరెంట్ ఉచ్చు తగిలి భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండలంలో ఇటీవల ఫారెస్ట్ బీట్ఆఫీసర్నవీన్ చనిపోయిన ఘటనపై ప్రభుత్వంతోపాటు ఫారెస్ట్ ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. అడవుల్లో పెట్రోలింగ్ సమయాల్లో కరెంట్ వైర్లు ఉంటే వాటి ఓల్టేజీ తెలుసుకునేందుకు అధునాతన పరికరాల కొనుగోలుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఎన్పీడీసీఎల్, పోలీస్ అధికారులతో కలిసి రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేషన్ మీటింగ్ను ఏర్పాటు చేసేందుకు సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని జిల్లా ఫారెస్ట్ఆఫీస్లో జిల్లా స్థాయి కో ఆర్డినేషన్ మీటింగ్నిర్వహించారు. మరోవైపు డ్రోన్లతో ఫారెస్ట్ను పర్యవేక్షించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హైఅలర్ట్
భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండలం నకిరిపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం అమర్చిన కరెంట్ వైర్లు తగిలి ఫారెస్ట్ బీట్ఆఫీసర్నవీన్ ఇటీవల చనిపోయారు. ఈ ఘటన అటు ఫారెస్ట్ శాఖతో పాటు ప్రభుత్వంలో కలకలం రేగింది. వన్యప్రాణుల కోసం వేటగాళ్లు కరెంట్ ఉచ్చులు పెడుతుండడంతో తాము విధులు ఎట్లా నిర్వహించాలనే చర్చ అటు ఆఫీసర్లతో పాటు ఇటు సిబ్బందిలో నెలకొంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ శాఖలో సిబ్బంది రక్షణకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు.
జిల్లా స్థాయిలో ఫారెస్ట్ అధికారులతో పాటు సీనియర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అడవిలో ఇల్లీగల్ కరెంట్వాడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం, దీని నివారణకు పోలీస్, విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకునేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో నాలుగు రోజుల కింద భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని డీఎఫ్వో ఆఫీస్లో ఎన్పీడీసీఎల్, పోలీస్ అధికారులతో ఫారెస్ట్అధికారులు కోఆర్డినేషన్ మీటింగ్నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలోనూ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. బీట్ఆఫీసర్ మృతికి కారణమైన వైర్లకు కరెంట్ఎక్కడి నుంచి వచ్చేందనే విషయమై ఆరా తీశారు. ట్రాన్స్ఫార్మర్ నుంచి దాదాపు కిలోమీటర్ దూరం వరకు ఇల్లీగల్గా వైర్లను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.
అధునాతన పరికరాల కొనుగోలుపై దృష్టి
అడువుల్లో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించేందుకు అధునాతన పరికరాలు కొనుగోలు చేసేందుకు ఫారెస్ట్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంట్వైర్లను దగ్గరికి వెళ్లేటప్పుడు ఓల్టేజీ విషయమై హెచ్చరించే పరికరాలను కొనుగోలు చేయనున్నారు. వీటితో పాటు ఇతరత్రా అధునాతన పరికరాలను సమకూర్చుకునేందుకు ఆఫీసర్లు నిర్ణయించారు. ఇన్సులేటెడ్ కండక్టర్ల ద్వారా కరెంట్సప్లై విషయమై విద్యుత్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అత్యవసరమైన ప్రాంతాలకు అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా కరెంట్ సప్లై చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దీంతోపాటు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అడవుల రక్షణ కోసం డ్రోన్లను వినియోగించేందుకు ప్లాన్ చేస్తున్నామని డీఎఫ్వో సిద్ధార్త్విక్రం సింగ్ పేర్కొన్నారు. ఇప్పటికే డ్రోన్ తెప్పించామన్నారు. జిల్లాలోని ప్రతి ఫారెస్ట్ డివిజన్కు కనీసం ఒక డ్రోన్ ఉండేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఫారెస్ట్అధికారులు, సిబ్బంది నిత్యం అడవుల్లో డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. కలప స్మగ్లర్లు, అడవి జంతువులను వేటాడే వారి నుంచి తమకు రక్షణ లేకుండా పోతోందని కొంతకాలంగా ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకువచ్చారు. ఫారెస్ట్ అధికారులకు గతంలో మాదిరిగా ఆయుధాలు ఇచ్చే విషయమై కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది.
