కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసు నిందితులు దొరికారు.. ఓయో రూమ్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసు నిందితులు దొరికారు..  ఓయో రూమ్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

సంచలనం సృష్టించి కూకట్ పల్లి మహిళ హత్య కేసును ఛేదించారు పోలీసులు. నిందితులను జార్ఖండ్ లో శనివారం (సెప్టెంబర్ 13) అదుపులోకి తీసుకున్నారు కూకట్ పల్లి పోలీసులు. జార్ఖండ్ వెళ్లిన స్పెషల్ టీం.. నిందితులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారు.

కూకట్ పల్లి స్వాన్ లేక్ అపార్టుమెంటులో పనిమనుషులే ఓనర్ రేణు అగర్వాల్ ను కుక్కర్ కొట్టి, కత్తితో దాడి చేసి దారుణంగా చంపేశారు. ఈ కేసులో ఐదు టీం లుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్ నగరం మొత్తాన్ని గాలించారు. అయితే నిందితులు హఫీజ్ పేట్ ఎంఎంటీఎస్ స్టేషన్ దగ్గర వదిలివెళ్లిన స్కూటీని శుక్రవారం గుర్తించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చేపట్టారు.

ఒక స్పెషల్ టీం జార్ఖండ్ వెళ్లి నిందితుల జాడను గుర్తించి పట్టుకుంది. టెక్నికల్, ఇతర ఎవిడెన్స్ ఆధారంగా నిందితుల జాడ పట్టుకున్నారు పోలీసులు. నిందితులను హైదరాబాద్ తరలించి జడ్జి ముందు హాజరు పర్చనున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 14) అధికారికంగా విలేకరుల సమావేశంలో వివరాలు చెప్పే అవకాశం ఉంది. 

ఓయో రూమ్లో దాక్కున్న నిందితులు:

ఓనర్ రేణు అగర్వాల్ ను ఆమె ఇంట్లో పనిచేసే హర్ష, పై అంతస్తు వర్కర్ రోషన్ లు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య తర్వాత 6 తులాల మంగళసూత్రం, ఖరీదైన వాచీలు ఎత్తుకెళ్లారు దుండగులు. హఫీజ్ పేట్‌లో బైక్ వదిలేసి క్యాబ్‌లో రాంచీకి పరారైనట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు సొంత ఇంటికి కూడా వెళ్లకుండా ఓయో రూమ్‌లో దాక్కున్నారు నిందితులు.  ప్రత్యేక ఆపరేషన్‌తో  దుండగులను పట్టుకున్నారు సైబరాబాద్ పోలీసులు. 
 

ఏంటి కేసు:

కూకట్ పల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె కాళ్లు చేతులు కట్టేసి, కత్తులతో పొడిచి, ప్రెషర్ కుక్కర్​తో కొట్టి అత్యంత పాశవికంగా దుండగులు హత్యకు పాల్పడ్డారు. పది రోజుల కింద ఇంట్లో పనికి చేరిన యువకుడు మరో వ్యక్తి సహకారంతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం దుండగులు అక్కడే స్నానం చేసి, పెద్ద మొత్తంలో నగలు, నగదుతో పరారైనట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రేణు (50), రాకేశ్ అగర్వాల్ దంపతులు. వీరికి 26 ఏండ్ల కొడుకు ఉండగా, అందరూ కలిసి కూకట్‌పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో13వ ఫ్లోర్​లో నివాసం ఉంటున్నారు.

రాకేశ్​బాలానగర్లో  స్టీల్​ట్రేడింగ్ ​బిజినెస్ చేస్తున్నాడు. రోజూ కొడుకుతో పాటు ఆఫీసుకు వెళ్లి రాత్రికి తిరిగి వస్తుంటాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం తన కొడుకుతో కలిసి ఆఫీస్​కు వెళ్లాడు. రాత్రి 7.30 సమయంలో ఇంటికి వచ్చారు. తాళం వేసి ఉండడంతో ఫ్లంబర్​ సాయంతో బాల్కనీ నుంచి తలుపు తీసి లోపలకు వెళ్లారు. అప్పటికే రేణు ​రక్తపు మడుగులో పడి, కాళ్లు, చేతులు కట్టేసి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్​ టీమ్​తో ఆధారాలు సేకరించారు. మృతురాలి ఒంటిపై, గొంతుపై కత్తులు, సిజర్స్​తో పొడిచిన ఆనవాళ్లు గుర్తించారు.

కాగా, పది రోజుల కింద జార్ఖండ్​ నుంచి వచ్చిన హర్ష(20) అనే యువకుడిని రేణు దంపతులు ఇంట్లో పనికి పెట్టుకున్నారు. ఇదే అపార్ట్​మెంట్​లో పనిచేస్తున్న  రోషన్  అనే వ్యక్తి చెప్పడంతోనే.. హర్షను పనిలోకి తీసుకున్నారు.  వీరిద్దరూ కలిసే దోపిడీకి ప్లాన్​ చేసి ఉంటారని, రేణు అగర్వాల్​అడ్డుకోవడంతోనే ఆమెను హత్య చేసి, దోపిడీ చేసి పరారై ఉంటారని ప్రాథమిక ఆధారాలతో పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులుగా భావిస్తున్న ఇద్దరు యువకులు లిఫ్ట్​లో బయటకు ఒక బ్యాగ్​తో కలిసి వెళుతుండడం సీసీ కెమెరాలో రికార్డయింది.