24 గంటల కరెంట్​ పేరుతో కోట్ల అవినీతి

24 గంటల కరెంట్​ పేరుతో  కోట్ల అవినీతి

సిరికొండ, వెలుగు: మంచిప్ప పైపులైన్​ద్వారా రైతులకు సాగునీరందిస్తానని రూరల్​ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ ఎన్నికల్లో ఇచ్చిన హమీ ఏమైందని మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ప్రశ్నించారు. గురువారం సిరికొండ కాంగ్రెస్​ పార్టీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రూరల్​లో  ఎకరం సాగు భూమికి నీరివ్వలేదని ఆరోపించారు. రూ.వెయ్యి కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత – చేవేళ్ల ప్రాజెక్ట్​వ్యయాన్ని కమీషన్ల కోసం రూ.8వేల కోట్లకు పెంచారన్నారు.

 పైప్​లైన్ ద్వారా సాగునీటిని అందిస్తామని పైలెట్​  ప్రాజెక్ట్​పేరు రూ.కోట్లు దోచుకున్నారన్నారు. కాళేశ్వరం లేదా ప్రాణహిత చేవెళ్ల ద్వారా ఇంత వరకు ఎకరానికి నీరు ఇవ్వలేదన్నారు. 24 గంటల ఉచిత కరెంట్​మాటున రూ.15 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఉచిత కరెంట్​పై రేవంత్​వ్యాఖ్యాలను వక్రీకరించి, బీఆర్​ఎస్​ రాజకీయ పబ్బం గడుపుతుందన్నారు. కాంగ్రెస్​తోనే బడుగు, బలహీన వర్గాలలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షులు రవి, చిన్న బాల్​రాజ్, బండారి నరేశ్, యూత్​అధ్యక్షుడు భూషణ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.