నా ఇంటి గోడ నేను దూకితే తప్పా?

నా ఇంటి గోడ నేను దూకితే తప్పా?

తెలుగు చిత్రసీమకు సంబంధించి దర్శకుడు దాసరి నారాయణరావు తెలియని వారుండరు. ఆయన 2017లో చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకులైన దాసరి అరుణ్ కుమార్, దాసరి ప్రభుల మధ్య ఆస్తి వివాదాలు జరుగుతున్నాయి. గతంలోనే వీరిద్దరి మధ్య గొడవలు జరగడంతో సినీ పెద్దలు నచ్చజెప్పారు. మళ్లీ ఇప్పుడు ఆ గొడవలు తెరమీదికొచ్చాయి. తాజాగా అరుణ్.. గోడ దూకి ప్రభు ఇంట్లోకి వెళ్లాడు. దాంతో ప్రభు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దానికి సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఈ రోజు ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కాంపౌండ్ లో  దాసరి అరుణ్ మీడియాతో మాట్లాడారు.

‘నా ఇంట్లోకి నేను వెళ్ళటం ట్రెస్ పాస్ ఎలా అవుతుంది? నాకు సంబంధించిన కొన్ని గవర్నమెంట్ డాక్యుమెంట్స్ తీసుకోవటానికి వెళ్ళాను. ఎంతసేపు బెల్ కొట్టినా ఎవరూ గేట్ తీయకపోవడంతో గేట్ దూకి వెళ్ళాను. సొంత ఇంట్లో తలుపులు తీయకపోతే ఎవరైనా చేసే పని అదే. కాబట్టి నేను ఎలాంటి అతిక్రమణకు పాల్పడలేదు. మా నాన్నగారు చనిపోయే ముందు ఎలాంటి వీలునామా రాయలేదు. కాబట్టి ఆయన ఉన్న ఇంటి మీద మా అన్నయ్యకు, నాకు, మా చెల్లికి సమాన హక్కులు ఉన్నాయి. కాబట్టి నా ఇంటికి ఎలాగైనా వెళ్లే హక్కు నాకు ఉంది. కానీ మానసిక స్థితి సరిగా లేని కారణంగా మా అన్న ప్రభు.. గతంలో కూడా చాలా సార్లు ఇలా మీడియాకు ఎక్కడం, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం చేశాడు. ఇప్పుడు కూడా నా డాక్యుమెంట్స్ తీసుకోవడానికి వెళ్తే ఇలా మీడియాకు ఎక్కి రభస చేశాడు. నా పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నింటిలో అదే అడ్రస్ ఉంది. దానికి తోడు నిన్న నాకు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ కొరియర్లో వస్తే దాన్ని కొరియర్ బోయ్ నుండి బలవంతంగా తీసుకున్నారు. కొరియర్ బోయ్ ఆ విషయం నాకు చెప్పగా అది తీసుకుందామని వెళితే ఇలా గొడవ చేసి 100కు డయల్ చేసి పోలీసులను పిలిపించాడు. కొద్ది సేపటికే అక్కడికి వచ్చిన జూబ్లీ హిల్స్ ఎస్. ఐ. నవీన్ గారు గట్టిగా ప్రశ్నించడంతో ఆ డాక్యుమెంట్స్ తెచ్చి ఇచ్చాడు. ఆయన ఫిర్యాదు చేస్తే వచ్చిన పోలీసులే ఆయనను గట్టిగా నిలదీయటంతో ప్రభు, అతని మామ కొరియర్ డాంక్యూమెంట్స్ తిరిగి ఇచ్చారు. ఆ ఇంట్లో దాదాపు 15 మందికి పైగా ఎవరెవరో ఉన్నారు. సమయానికి పోలీసులు రావటం.. వారికంటే మాకే ప్రొటెక్షన్ అయ్యింది. ఇదీ జరిగింది’ అంటూ దాసరి అరుణ్ కుమార్ గురువారం రాత్రి జరిగిన సంఘటన పూర్వాపరాలను మీడియాకు వివరించారు.

‘నాన్నగారి మరణం తరువాత అమ్మిన కొన్ని ఆస్తుల తాలూకూ వాటా ఇవ్వకుండా నేను మోసం చేశానని ప్రభు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అప్పడు పోలీసులు.. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని అడగటంతో మౌనంగా ఉండిపోయాడు. ఇలా సంవత్సరానికి ఒకటి, రెండు సార్లు ఏదో ఒక వివాదంతో మీడియాకు ఎక్కడం, పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వడం అతనికి మామూలైపోయింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి చిరంజీవి గారు ప్రయత్నిస్తున్నారని వార్త వచ్చింది. కానీ.. అలాంటిదేమీ లేదు. ఆ వార్త ఎలా వచ్చిందో తెలీదు. మెగాస్టార్ చిరంజీవి గారిని ఇందులోకి లాగటం భావ్యం కాదు. మోహన్ బాబు గారు, మురళీ మోహన్ గారు, సి.కళ్యాణ్ గారు ఇందులో జోక్యం చేసుకొని పరిష్కరించాలి అని ప్రభు అంటున్నారు. అంత పెద్ద వాళ్ళు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పుడు వాళ్ళ గౌరవాన్ని కాపాడాలి కదా. వాళ్ళు వచ్చి మా కోసం వెయిట్ చేసే పరిస్థితి కల్పించకూడదు. గతంలో అలా చేయడంతో వాళ్ళు విసుగు చెంది వదిలేశారు. ఇప్పటికైనా వాళ్ళు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దితే నేను కృతజ్ఞడినై ఉంటాను’ అని దాసరి అరుణ్ కుమార్ అన్నారు.

For More News..

వీడియో: పదేళ్ల క్రితం.. ప్రస్తుతం సూర్యుడు ఎలా ఉన్నాడంటే..

మాస్క్ వేసుకోనందుకు ఆర్డర్ తీసుకోని వెయిటర్.. టిప్ గా రూ. 33 లక్షలు