- ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారంటూ మండిపాటు
- ఇందిరాపార్క్ వద్ద రిటైర్డ్ ఉద్యోగుల మద్దతుగా బీజేపీ నిరాహార దీక్ష
హైదరాబాద్/కామారెడ్డి టౌన్, వెలుగు: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలలో ఏ ఒక్కటీ అమలు చేయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈ రాష్ట్రంలో అడుగుపెట్టే నైతిక అర్హత లేదని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు ఇస్తానంటారని, కానీ రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు వెయ్యి రూపాయలు విదిల్చే పరిస్థితి లేదని మండిపడ్డారు.
ఇదేనా మీ ప్రజాపాలన.. అసలు ఏ ముఖం పెట్టుకుని రాహుల్ ఈ రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పాలనను ‘గడ్డపార రాజ్యం’గా రాంచందర్ రావు అభివర్ణించారు.
పరిపాలన అంటే ప్రజలకు మేలు చేయడమని, కానీ రేవంత్ రెడ్డి చేతిలో గడ్డపార, మంత్రుల చేతుల్లో పారలు పట్టుకుని పేదల ఇండ్లను కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆర్థిక ఇబ్బందులు తాళలేక, వైద్యం అందక రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ను వెంటనే చెల్లించకపోతే, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు విశ్రమించబోమని హెచ్చరించారు.
ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తే కమీషన్లు రావన్న కారణంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పెండింగ్లో పెడుతోందని ఆరోపించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 6.4 లక్షల మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన ఏండ్ల తరబడి ఎరియర్స్ పెండింగ్లో ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్లు, గుత్తేదారులకు రూ.వేల కోట్లు చెల్లించే ప్రభుత్వానికి, రాష్ట్రానికి సేవ చేసిన ఉద్యోగుల బకాయిలు చెల్లించడానికి మాత్రం డబ్బులు ఉండవా అని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రాకేశ్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల్రాజు తదితరులు పాల్గొన్నారు.
పైసల కోసమే రాహుల్ వచ్చిండు..
పైసల వసూలుకే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారని రాంచందర్ రావు ఆరోపించారు. ప్రజాస్వామ్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. సోమవారం కామారెడ్డిలో బీజేపీ జోనల్ స్థాయి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై, మాట్లాడారు. ఒవైసీకి కాంగ్రెస్ ప్రభుత్వం కొమ్ముకాస్తుందని, బాన్సువాడలో జరిగిన సంఘటనల్లో హిందువులపైనే కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. బాన్సువాడ, కామారెడ్డి, రుద్రారంలో జరిగిన దాడుల్లో ఎంఐఎం హాస్తం ఉందని ఆయన ఆరోపించారు.
