Manchu Vishnu: యుద్ధ భయంతో చిన్నారి ఐరా.. దుబాయ్ నుంచి మంచు విష్ణు షాకింగ్ వీడియో

Manchu Vishnu: యుద్ధ భయంతో చిన్నారి ఐరా.. దుబాయ్ నుంచి మంచు విష్ణు షాకింగ్ వీడియో

ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు దుబాయ్‌లో ఎదురైన భయానక అనుభవాన్ని వెల్లడించారు. ఆకాశంలో క్షిపణులు దూసుకెళ్తున్న దృశ్యాలను వీడియోగా పోస్టు చేసిన ఆయన, క్షిపణుల ప్రభావంతో తాము ఉన్న ఇల్లు కంపించిందని తెలిపారు.

యుద్ధ శబ్దాలతో తన చిన్నారి ఐరా భయపడిందని భావోద్వేగంగా పేర్కొన్న మంచు విష్ణు, “ఏ చిన్నారి కూడా యుద్ధ వాతావరణంలో పెరగకూడదు. ప్రపంచంలో ఎక్కడైనా పిల్లలకు ప్రశాంతమైన జీవనం ఉండాలి” అంటూ శాంతి కోసం ఆకాంక్షించారు. అలాగే పౌరుల భద్రత కోసం కృషి చేస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రక్షణ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

“ఈ రాత్రి దుబాయ్లో కుటుంబ సభ్యులతో ఉన్నాను. ఆకాశంలో కనిపిస్తున్న క్షిపణుల వల్ల మేము ఉన్న ఇల్లు కంపించింది. ఆ శబ్దాలకు ఐరా చాలా భయపడింది. శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. ఏ బిడ్డ కూడా యుద్ధ శబ్దం విని పెరగకూడదు. పౌరులను సురక్షితంగా ఉంచినందుకు యుఎఈ రక్షణ దశాలకు కృతజ్ఞతలు. ఇలాంటి క్షణాలు జీవితం నిజంగా ఎంత దుర్బలమైనదో గుర్తుచేస్తాయి. బలం, శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. హార్ హార్ మహాదేవ్” అని విష్ణు తన X ఖాతాలో రాసుకొచ్చారు.

భారత స్టార్ షట్లర్ పీ.వి. సింధు:

మరోవైపు భారత స్టార్ షట్లర్ పీ.వి. సింధు కూడా దుబాయ్‌లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆమె సోషల్ మీడియాలో వీడియో ట్వీట్ చేయడంతో దీనిపై స్పష్టత వచ్చింది.

తన సోషల్ మీడియా ఖాతాలో సింధు మాట్లాడుతూ, “ఎయిర్‌పోర్ట్ సమీపంలో బాంబులు పడినట్లు సమాచారం వచ్చింది. కోచ్‌తో పాటు మేమంతా ఒక్కసారిగా పరుగులు తీశాం. పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మేమంతా సురక్షితంగా ఉన్నాం. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్‌, అథారిటీలకు కృతజ్ఞతలు. అలాగే ఇండియన్ హై కమిషన్ మా భద్రతపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది” అని పేర్కొన్నారు. త్వరలో పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని ఆమె ఆకాంక్షించారు.

ప్రస్తుతం సింధు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, నెటిజన్లు “బీ సేఫ్” అంటూ ఆమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. దుబాయ్‌తో పాటు మధ్యప్రాచ్య ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణంలో ఉండటంతో, అక్కడ ఉన్న భారతీయుల్లో ఆందోళన నెలకొంది.