Aasha Singh: సినీ, మిమిక్రీ రంగాల్లో చెరగని ముద్ర.. నటి ఆశా సింగ్ జైస్వాల్ కన్నుమూత.. ‘ఐరన్ లేడీ’కి నివాళి

Aasha Singh: సినీ, మిమిక్రీ రంగాల్లో చెరగని ముద్ర..  నటి ఆశా సింగ్ జైస్వాల్ కన్నుమూత.. ‘ఐరన్ లేడీ’కి నివాళి

ప్రముఖ సీనియర్ నటి, మిమిక్రీ ఆర్టిస్ట్, సామాజిక సేవకురాలు ఆశా సింగ్ జైస్వాల్ (Aasha Singh Jaiswal) కన్నుమూశారు. సినిమాలు, టెలివిజన్‌తో పాటు లైవ్ ప్రదర్శనల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన ఆమె ఆగస్టు 22న రాత్రి 7:30 గంటల సమయంలో ముంబైలో తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు ఆకాష్ భరద్వాజ్ తెలిపారు. మరుసటి రోజు విలే పార్లే వెస్ట్‌లోని పవన్ హన్స్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

తల్లి మృతిపై ఆకాశ్ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన తల్లిని ‘ఐరన్ లేడీ’గా అభివర్ణించిన ఆయన.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాలని అభిమానులను కోరారు. ఆకాశ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఆమె జీవితంలో కళ, పని, సేవే అన్నింటికంటే ముఖ్యమైనవని పేర్కొన్నారు. ఆమె చేసిన సేవలు, కళారంగానికి అందించిన సహకారాలను గుర్తు చేసుకోవడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. ఆశా సింగ్ జైస్వాల్ మృతి పట్ల సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె వయస్సు 83 సంవత్సరాలు.

ఆశా సింగ్ సినీ ప్రస్థానం..

ఆశా సింగ్ జైస్వాల్‌ది దశాబ్దాల పాటు కొనసాగిన సుదీర్ఘ సినీ ప్రయాణం. సినిమాలు, టెలివిజన్, లైవ్ షోలతో పాటు మిమిక్రీ కళలోనూ ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రముఖ నటి మీనాకుమారిను అనుకరిస్తూ చేసిన మిమిక్రీ ప్రదర్శనలకు ఆమె మంచి ఆదరణ పొందారు. ఈ కళను లైవ్ ప్రదర్శనల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ చేశారు.

►ALSO READ | Kangana Ranaut: బికినీలో రాఖీ కట్టాల్సిన అవసరమేంటి?.. కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై కంగనా రనౌత్ ఫైర్‌!

టెలివిజన్ ప్రేక్షకులకు ఆమె బీఆర్ చోప్రా తెరకెక్కించిన ‘మహాభారత్’ సీరియల్‌లో కృపాచార్యుడి సోదరి కృపి పాత్రలో నటించడం ద్వారా మరింతగా గుర్తుండిపోయారు. అలాగే ‘బాజిగర్’, ‘బాబీ జాసూస్’, ‘దీవాన్గీ’, ‘ఆగ్’, ‘కాయిదా కానూన్’, ‘ఆంసూ బనే అంగారే’, ‘ఘర్ బజార్’ తదితర చిత్రాల్లోనూ ఆమె వివిధ పాత్రల్లో నటించారు.ఎం నటనతో పాటు మిమిక్రీ రంగంలోనూ మార్గదర్శక మహిళల్లో ఒకరిగా ఆశా సింగ్ జైస్వాల్ గుర్తింపు పొందారు. ఆమె ఆశా ఈవెంట్స్ అండ్ ఫిల్మ్స్ సంస్థను స్థాపించి, సామాజిక సేవా కార్యక్రమాలతోనూ అనుబంధంగా కొనసాగారు.

ఆశా జైస్వాల్ సింగ్‌కు AICWA ఘన నివాళి..

మిమిక్రీ కళాకారిణి ఆశా జైస్వాల్ సింగ్ మృతిపట్ల ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
‘మహాభారత్’లో కృపి పాత్రతో గుర్తింపు పొందిన ఆశా జైస్వాల్.. ‘బాబీ జాసూస్’, ‘దీవాన్గీ’, ‘ఆగ్’, ‘కాయదా కానూన్’, ‘ఆంసూ బనే అంగారే’, ‘ఘర్ బజార్’ వంటి చిత్రాల్లోనూ నటించి చెరగని ముద్ర వేసింది. దశాబ్దాల పాటు భారతీయ సినీ, టెలివిజన్ రంగానికి సేవలందించిన ఆశా జైస్వాల్ సింగ్ మృతి ఒక శకం ముగిసినట్లేనని AICWA పేర్కొంది. ఆమె నటన, మిమిక్రీ, కళాసేవలు, జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయని సంఘం తెలిపింది. ఆశా జైస్వాల్ సింగ్‌కు ఘన నివాళి.. ఓం శాంతి.