
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందం ఉంటే చాలదు, అదృష్టం కూడా ఉండాలి అంటుంటారు. అది నిజమేననిపిస్తుంది ఈషా రెబ్బాని చూస్తే. ఈ అచ్చ తెలుగు అమ్మాయి అందంగా ఉంటుంది. చక్కగా నటిస్తుంది. కానీ కోరుకున్న స్టార్డమ్ అయితే రాలేదు. అలా అని అవకాశాలు లేకుండానూ పోలేదు. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో నటిస్తోంది. తెలుగులో వెబ్ సిరీసులు చేస్తోంది. ఆల్రెడీ ‘త్రీ రోజెస్’లో యాక్ట్ చేసింది. రీసెంట్గా ‘మాయాబజార్’ అనే మరో సిరీస్కి కమిటయ్యింది. పాష్ పోరీస్, మన ముగ్గురి లవ్స్టోరీ వంటి సిరీసులకు రైటర్గా వర్క్ చేసిన గౌతమి చల్లగుల్ల ఈ సిరీస్తో డైరెక్టర్గా పరిచయమవుతున్నారు. రానా దగ్గుబాటి నిర్మిస్తున్నాడు.
ఈ ప్రాజెక్ట్ ఇటీవల గ్రాండ్గా మొదలైంది. సురేష్ బాబు, కె.రాఘవేంద్రరావు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నరేష్, ఝాన్సీ, రవివర్మ, హరితేజ, సునైన తదితరులు నటిస్తున్న ఈ సిరీస్ మొత్తం ‘మాయాబజార్’ అనే గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ తిరుగుతుంది. కొత్తగా పెళ్లయిన జంటలు, వయసు మీదపడిన వారితో పాటు అక్కడ ఎంతోమంది విల్లాలు కొనుక్కుంటారు. అయితే ఇనాగరేషన్ రోజునే ఆ కమ్యూనిటీ బ్రాండ్ అంబాసిడర్ అయిన ఓ సెలెబ్రిటీ క్లబ్ హౌస్ టెర్రస్ మీద నుంచి పడి చనిపోతాడు. ఆ తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చాయి, వాటిని బయ్యర్స్ ఎలా అధిగమించారు, అసలా సెలెబ్రిటీ ఎందుకు చనిపోయాడు లాంటి అంశాలతో సాగే థ్రిల్లర్ ఇది. ఈషా కెరీర్కి ఎంతవరకు హెల్పవుతుందో చూడాలి మరి!