2025 సంవత్సరం భారతీయ చిత్ర పరిశ్రమ ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా దక్షిణాది స్టార్లు తమ సత్తా చాటుతూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించారు. మాలీవుడ్ లెజెండ్ మోహన్ లాల్ నుంచి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి శాండల్వుడ్ సెన్సేషన్ రిషబ్ శెట్టి వరకు ప్రతి ఒక్కరూ తమదైన ముద్ర వేశారు. బాక్సాఫీస్ వద్ద కేవలం భారీ చిత్రాలే కాకుండా, వినూత్నమైన కథలు, ప్రయోగాత్మక చిత్రాలు కూడా కాసుల వర్షాన్ని కురిపించాయి. సౌత్ ఇండియా సినిమా స్టామినాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాయి..
కాంతార: చాప్టర్ 1 – బాక్సాఫీస్ రికార్డుల రారాజు
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'కాంతార: చాప్టర్ 1' 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. రూ. 130 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ అద్భుతమైన చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 850 - 900 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా కేవలం కన్నడలోనే కాకుండా హిందీ, తెలుగు భాషల్లో కూడా భారీ విజయాన్ని నమోదు చేసి నేషనల్ లెవల్లో ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, నాన్-తెలుగు సినిమాల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీని విజువల్స్ , కథా నేపథ్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
కూలీ (Coolie) – రజనీకాంత్ మాస్ మేనియా
సూపర్ స్టార్ రజనీకాంత్ , లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన 'కూలీ' 2025లో అత్యంత క్రేజీ ప్రాజెక్టుగా నిలిచింది. రూ. 350 కోట్ల భారీ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం, మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ రజనీకాంత్ మేనియాతో బాక్సాఫీస్ వద్ద రూ. 517 - 600 కోట్ల వరకు వసూలు చేసింది.. అమీర్ ఖాన్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, వంటి స్టార్ కాస్ట్తో ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్లా నిలిచింది.
మహావతార్ నరసింహ – యానిమేషన్ చరిత్రలో కొత్త అధ్యాయం
భారతీయ యానిమేషన్ చిత్రాల స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం 'మహావతార్ నరసింహ'. కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం.. ఏకంగా రూ. 325 కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. పురాణ గాథను టెక్నాలజీతో జోడించి చూపించిన తీరు చిన్నారులనే కాకుండా పెద్దలను కూడా ఆకట్టుకుంది.
లోక చాప్టర్ 1: చంద్ర - మాలీవుడ్ సెన్సేషన్
మలయాళ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన చిత్రం 'లోక చాప్టర్ 1: చంద్ర'. కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సూపర్ హీరో ఫిల్మ్, మాలీవుడ్లో రూ. 300 కోట్ల మార్కును దాటిన మొదటి చిత్రంగా రికార్డు సృష్టించింది. దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా, స్త్రీ ప్రధాన చిత్రాల్లో సరికొత్త బెంచ్మార్క్గా నిలిచింది.
దే కాల్ హిమ్ ఓజీ (OG) – పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ గర్జన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత వెండితెరపై కనిపించిన చిత్రం 'OG'. సుజీత్ మేకింగ్ స్టైల్, థమన్ మ్యూజిక్ ఈ సినిమాను మరో లెవల్కు తీసుకెళ్లాయి. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా రూ. 250 కోట్ల బడ్జెట్తో రూపొంది, ప్రపంచవ్యాప్తంగా రూ. 295 - 300 కోట్ల వసూళ్లు సాధించింది. తొలిరోజే రూ. 150 కోట్లకు పైగా గ్రాస్తో టాలీవుడ్లో సంచలనం సృష్టించింది. ఈ మూవీ అభిమానుల అంచనాలను అందుకుని రికార్డు సృష్టించింది.
►ALSO READ | Divvela Madhuri: అనసూయపై దివ్వెల మాధురి సంచలన కామెంట్స్.. అంతమాట అనేసిందేంటి..?
ఎల్2 ఎంపురాన్ (L2 Empuraan) – మలయాళ సినిమా సత్తా
మోహన్ లాల్ , పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో వచ్చిన 'లూసిఫర్' సీక్వెల్ 'L2 ఎంపురాన్' బాక్సాఫీస్ను షేక్ చేసింది. రూ. 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ భారీ చిత్రం రూ. 268 కోట్ల బిజినెస్ చేసి మాలీవుడ్ స్థాయిని చాటిచెప్పింది.
సంక్రాంతికి వస్తున్నాం – ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్
విక్టరీ వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఈ ఏడాది ప్రారంభంలోనే భారీ విజయాన్ని నమోదు చేసింది. రూ. 50 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ. 259 కోట్ల గ్రాస్ వసూలు చేసి వెంకటేష్ కెరీర్లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది.
తుడరుమ్ (Thudarum) – మోహన్ లాల్ హ్యాట్రిక్
మోహన్ లాల్ 2025లో 'ఎంపురాన్', 'హృదయపూర్వం'తో పాటు 'తుడరుమ్' చిత్రంతో కూడా మ్యాజిక్ చేశారు. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా రూ. 235 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద అందరినీ ఆశ్చర్యపరిచింది.
సు ఫ్రమ్ సో (Su From So) – 2025 మిరాకిల్ హిట్
కన్నడలో కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్తో రూపొందిన 'సు ఫ్రమ్ సో' అనే హారర్ కామెడీ చిత్రం ఏకంగా రూ. 125 కోట్లు వసూలు చేసి 'లో-బడ్జెట్.. హై-రిటర్న్స్' ఫార్ములాకు నిదర్శనంగా నిలిచింది.
మొత్తానికి 2025 సంవత్సరం సౌత్ ఇండియన్ సినిమా పవర్ ఏమిటో మరోసారి నిరూపించింది. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలైనా, స్టార్ పవర్ ఉన్న పెద్ద సినిమాలైనా ప్రేక్షకులకు నచ్చితే వసూళ్ల వర్షం కురుస్తుందని ఈ విజయాలు నిరూపించాయి.
