సీనియర్ నటి మీనా రాజకీయాల్లోకి రానున్నారా.. త్వరలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా అంటే అవుననే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు కారణం లేకపోలేదు. ఇటీవల కేంద్ర సమాచార, మత్స్య అభివృద్ధి, పశు సంవర్థక శాఖ మంత్రి ఎల్.మురుగన్ ఢిల్లీలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు హాజరయ్యారు. సడన్ గా అక్కడ నటి మీనా కూడా ప్రత్యక్షమయ్యారు.
మోదీతో కలిసి సంక్రాంతి వేడుకల్లో మీనా పాల్గొన్నారు. అనంతరం ఎల్.మురుగన్ మీనాను పార్టీ పెద్దలకు పరిచయం చేశారు. ఆమె త్వరలో బీజేపీలో చేరనున్నారని అందుకే ఆమెకు అంతటి ప్రాధాన్యత ఇచ్చారని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఎల్.మురుగన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే చాలా మంది సినీ ప్రముఖులు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మీనా కూడా అందులోకి వెళ్తారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది.
తమిళనాడులో సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలితతో పాటు ప్రస్తుతం సీఎం పీఠంపై ఉన్న స్టాలిన్ సైతం సినీ రంగం నుంచి వచ్చినవారే. మీనా స్నేహితురాలు, నటి ఖుష్బూ ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు. ఖుష్బూ బీజేపీలో చేరిన కొన్ని రోజులకే అధిష్టానం ఆమెకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో మీనా లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరుగతోంది.