
- సీఎం కేసీఆర్ వద్దకు ఫైల్
- 843 మందికి ప్రయోజనం
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ల అడ్హక్ ప్రమోషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. సీఎం కేసీఆర్ వద్ద ఈ దస్త్రం ఉంది. ఈ నెల్లోనే క్లియరెన్స్ వచ్చే అవకాశమున్నట్టు ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 1975 ఎస్క్యూటీ బ్యాచ్ తర్వాత రిక్రూట్ అయిన వారికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు మించి ప్రమోషన్లు ఇవ్వలేదు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి మొదలుకొని ఇంజనీర్ ఇన్ చీఫ్ హోదా వరకు పనిచేసే అధికారులంతా డీఈఈ స్కేల్ తీసుకొనే ఉద్యోగాలు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో సుదీర్ఘకాలం ప్రమోషన్లు ఇవ్వలేదు. దీంతో తమకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ ఇంజనీర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రాంతంలో జోన్ -5, జోన్- 6 ఇంజనీర్ల మధ్య ప్రమోషన్లపై వివాదం ఉంది. చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్ ఇన్ చీఫ్ పోస్టులన్నీ జోన్ -5 వారికే ఇచ్చారని ఆరో జోన్ ఇంజనీర్లు పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు.
రూ.20 కోట్ల ఆర్థిక భారం
ఇంజనీర్ల ప్రమోషన్లపై న్యాయ వివాదాలు ఉండటంతో అది పరిష్కారం అయ్యే వరకు అడ్హక్ ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించేందుకు ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్రావు, శంకర్, సీఈ హమీద్ ఖాన్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సిఫార్సుల మేరకు డీఈఈ కేడర్లో ఉన్నత హోదాల్లో పనిచేస్తున్న, రిటైర్డ్ అయిన 843 మంది ఇంజనీర్లకు అడ్హక్ ప్రమోషన్లు ఇవ్వాలని సిఫార్సు చేశారు. దీనికి సంబంధించిన ఫైల్ ఫైనాన్స్, లా, జీఏడీ డిపార్ట్మెంట్లలో క్లియర్ అయ్యి సీఎంవోకు చేరింది. ప్రమోషన్లకు సీఎం కేసీఆర్ సైతం సానుకూలంగా ఉండటంతో త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ప్రమోషన్ల కారణంగా రూ.20 కోట్ల ఆర్థికభారం పడుతుందని అంచనా.