న్యూఢిల్లీ : బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ మీడియా రంగంలో తన ఉనికిని విస్తరించుకుంటోంది. వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మెజారిటీ వాటాను దక్కించుకుంది. ఈ డీల్ విలువను మాత్రం బయటపెట్టలేదు. అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్ ఐఏఎన్ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 50.50 శాతం వాటాను కొనుగోలు చేసిందని రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. బిజినెస్ ఫైనాన్షియల్ న్యూస్, డిజిటల్ మీడియా ప్లాట్ఫారమ్ బీక్యూ ప్రైమ్ను నిర్వహించే క్వింటిలియన్ బిజినెస్ మీడియాను గత ఏడాది అదానీ కొనుగోలు చేసింది.
ఈ డీల్ ద్వారా అదానీ గత మార్చిలో మీడియా వ్యాపారంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత డిసెంబర్లో న్యూస్ చానెల్ఎన్డీటీవీలో దాదాపు 65 శాతం వాటాను తీసుకుంది. ఈ కొనుగోళ్లను ఏఎంఎన్ఎల్ ద్వారా పూర్తి చేసింది. ఐఏఎన్ఎస్కి సంబంధించి వారి ఇంటర్- సె రైట్లను (రెండు పార్టీల మధ్య ప్రత్యేక హక్కులు) రికార్డ్ చేయడానికి ఐఏఎన్ఎస్తోపాటు ఐఏఎన్ఎస్ వాటాదారు సందీప్ బామ్జాయ్తో ఏఎంఎన్ఎల్ వాటాదారుల ఒప్పందంపై సంతకం చేసింది. ఐఏఎన్ఎస్ 2022-–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.86 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక నుంచి ఐఏఎన్ఎస్ ఆపరేషనల్, మేనేజ్మెంట్ కంట్రోల్ ఏఎంఎన్ఎల్ వద్ద ఉంటుంది. డైరెక్టర్లను నియమించే హక్కు కూడా దఖలు పడింది.