ముంబై: గత కొంత కాలం నుంచి విపరీతంగా పెరుగుతూ వస్తున్న అదానీ గ్రూప్ షేర్లు సోమవారం సెషన్లో భారీగా క్రాష్ అయ్యాయి. అదానీ గ్రూపు కంపెనీల్లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన మూడు ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) అకౌంట్లను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) ఫ్రీజ్ చేసిందనే వార్తలు వచ్చాయి. దీంతో సోమవారం సెషన్లో అదానీ షేర్లు భారీగా నష్టపోయాయి. మార్కెట్ ఓపెన్ అయిన మొదటి గంటలోనే గౌతమ్ అదానీ సంపద రూ. 73,500 కోట్లు పడింది. కాగా, ఈ మూడు ఎఫ్పీఐ అకౌంట్ల వద్ద రూ. 43,500 కోట్ల విలువైన అదానీ షేర్లు ఉన్నాయి. వీటి బేస్ మారిషస్ కాగా, ఈ మూడు కంపెనీలకు ఒకే అడ్రస్ ఉండడం విశేషం. అంతేకాకుండా ఈ మూడు ఫండ్లు కూడా తమ 90 శాతం డబ్బులను అదానీ గ్రూప్కు చెందిన నాలుగు కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేశాయి. సాధారణంగా ఏదైనా ఫండ్ ఒకే షేర్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయదు. ఈ వార్తలు నిజం కాదని అదానీ గ్రూప్ ఓ స్టేట్మెంట్ను విడుదల చేసింది. సోమవారం సెషన్ ఇంట్రాడేలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ఏకంగా 25 శాతం క్రాష్ అయ్యి రూ. 1,201.10 వద్ద లోవర్ సర్క్యూట్ను టచ్ చేసింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకానమిక్ జోన్ షేరు 18.75 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు 5 శాతం పడ్డాయి. మిగిలిన వాటిలో అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 5 శాతం, అదానీ పవర్ 5 శాతం మేర నష్టపోయాయి. మార్కెట్ తిరిగి రికవరీ అవ్వడంతో సెషన్ ముగిసే నాటికి ఈ షేర్లు కూడా నష్టాలను తగ్గించుకోగలిగాయి.
ఎందుకు పడ్డాయంటే..
అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు అదానీ గ్రూప్ షేర్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేశాయి. ఈ మూడు ఫండ్లు సెబీ వద్ద ఎఫ్పీఐ అకౌంట్లుగా రిజిస్టర్ చేసుకున్నాయి. వీటి అకౌంట్లను ఎన్ఎస్డీఎల్ ఫ్రీజ్ చేసిందనే వార్తలు రావడంతో అదానీ షేర్లు నష్టపోయాయి. ఈ ఏడాది మే 31కి ముందే ఈ ఎఫ్పీఐల అకౌంట్లను ఎన్ఎస్డీఎల్ ఫ్రీజ్ చేసిందని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. మనీ లాండరింగ్ చట్టం కింద ఓనర్షిప్ డిటైల్స్కు సంబంధించి అవసరమైన డేటాను ప్రొవైడ్ చేయకపోవడం వల్లే ఈ అకౌంట్లను ఎన్ఎస్డీఎల్ ఫ్రీజ్ చేసి ఉంటుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. డీమాట్ అకౌంట్లను ఫ్రీజ్ చేస్తే ఉన్న షేర్లను అమ్మడానికి కాని, కొత్తగా షేర్లను కొనడానికి వీలుండదు.
మార్కెట్ పెరిగింది..
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు లాభపడడంతో సోమవారం సెషన్లో మార్కెట్ పాజిటివ్గా ముగియగలిగింది. అదానీ షేర్లు భారీగా క్రాష్ అవ్వడంతో ఇంట్రాడే 600 పాయింట్ల వరకు నష్టపోయిన సెన్సెక్స్, సెషన్ ముగిసే నాటికి 77 పాయింట్లు లాభంతో 52,552 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 200 పాయింట్లు పడిన నిఫ్టీ, చివరికి 13 పాయింట్లు పెరిగి 15,812 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, పవర్గ్రిడ్, ఎల్ అండ్ టీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కోటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, సన్ఫార్మా, బజాజ్ ఆటో షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
తప్పుడు వార్తలివి: అదానీ పోర్ట్స్
ఇంగ్లిష్ మీడియా ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన వార్తలు తప్పు అని అదానీ పోర్ట్స్ ఓ స్టేట్మెంట్ను విడుదల చేసింది. అల్బుల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లను ఎన్ఎస్డీఎల్ ఫ్రీజ్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. తప్పుడు వార్తలతో రిటైల్ ఇన్వెస్టర్లకు, అదానీ గ్రూప్కు పెద్ద నష్టం జరిగిందని పేర్కొంది. రిజిస్టర్ అండ్ ట్రాన్సఫర్ ఏజెంట్కు ఈ మూడు ఫండ్ల డీమాట్ అకౌంట్ల స్టేటస్ గురించి రిక్వెస్ట్ పెట్టామని, ఈ మూడు ఫండ్ల డీమాట్ అకౌంట్లు ఫ్రీజ్ కాలేదని ఆన్సర్ వచ్చిందని పేర్కొంది.
3 ఫండ్ల అకౌంట్లను ఎన్ఎస్డీఎల్ ఫ్రీజ్ చేయలేదు
అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన మూడు ఫండ్ల అకౌంట్లు ఫ్రీజ్ కాలేదని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ అధికారి ఒకరు చెప్పారని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ఇతర షేర్లకు సంబంధించి ఈ ఫండ్ల అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయని, ప్రస్తుతం ఎటువంటి యాక్షన్ను ఎన్ఎస్డీఎల్ తీసుకోలేదని తెలిపింది.