ఆదిలాబాద్టౌన్, వెలుగు: విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆకాంక్షించారు. బుధవారం ఆదిలాబాద్ అర్బన్, రూరల్ మండలాలతో పాటు బంగారుగూడ కేజీబీవీల్లో యూఎస్పీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఎస్ఆర్ నిధులతో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, నవార్స్ ఎడ్యుటెక్ సహకారంతో ఏర్పాటు చేసిన ఖగోళ, అంతరిక్ష ప్రయోగశాలను కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరిక్ష ప్రయోగశాల విద్యార్థులలో జిజ్ఞాసను పెంచుతుందని, భవిష్యత్తులో అంతరిక్ష శాస్త్రవేత్తలుగా, స్పేస్ స్టార్టప్లు ప్రారంభించే స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్, కంపెనీ ప్రతినిధి డాక్టర్ మృణాల్ జైవంత్, టీడీఎఫ్ ప్రతినిధులు రాజేశ్వర్ రెడ్డి, వినీల్ రెడ్డి, నవార్స్ ఎడ్యుటెక్ ప్రతినిధులు శశాంక కూన, అరుణ్, తహసీల్దార్లు శ్రీనివాస్, గోవింద్, సెక్టోరల్ అధికారి ప్రత్యూష, ప్రత్యేక అధికారులు కవిత, దీప్తి పాల్గొన్నారు.

