న్యూఢిల్లీ: భారత 26వ నావికా దళాధిపతి (నేవీ చీఫ్)గా అడ్మిరల్ దినేశ్కుమార్ త్రిపాఠి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్ ఆర్ హరికుమార్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో డీకే త్రిపాఠి ఈ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని సౌత్బ్లాక్లో ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా త్రిపాఠి మాట్లాడుతూ.. ఇండియన్ నేవీ అన్నివిధాలా పటిష్టంగా ఉన్నదని చెప్పారు.
ఏండ్లుగా ఇందుకు కృషిచేసిన నేవీ మాజీ చీఫ్లకు కృతజ్ఞతలు తెలిపారు. శత్రువులను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని నావికా దళానికి పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్లక్ష్యాలను చేరుకునేందుకు నేవీని బలోపేతం చేస్తానని చెప్పారు. నేవీలో మానవ వనరులకు అత్యంత ప్రాధాన్యతనిస్తానని, నావికాదళంలో పనిచేసేవారందరికీ అత్యుత్తమ శిక్షణతోపాటు అధునాతన సాంకేతికతతో కూడిన ఆయుధాలు అందజేస్తానని, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్తోపాటు ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ కల్పిస్తానని తెలిపారు.
తల్లి పాదాలకు నమస్కరించి బాధ్యతలు
నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించే ముందు త్రిపాఠి తన తల్లిపాదాలకు నమస్కరించారు. జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరులకు నివాళులర్పించారు. కాగా, డీకే త్రిపాఠి ఇప్పటివరకూ ఇండియన్ నేవీ వైస్ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన 1964 మే 15న జన్మించారు. రేవా సైనిక్ స్కూల్లో స్టడీ పూర్తిచేశారు. 1985 జులై 1న ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేశారు.
కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎక్స్పర్ట్గా డీకే త్రిపాఠీకి పేరుంది. వెస్టర్న్ నావల్ కమాండ్కు
ఫ్లాగ్ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. వినాశ్, కిర్చ్, త్రిశూల్నావల్ షిప్లను కమాండ్ చేసిన అనుభవం ఉన్నది. ప్రఖ్యాత ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమాల కమాండెంట్గా పనిచేశారు. అతి విశిష్ఠ్ సేవా మెడల్ (ఏవీఎస్ఎం), నౌసేన మెడల్(ఎన్ఎం) పురస్కారాలను అందుకున్నారు.