మూసీ నుంచి డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లకు తరలిన.. 169 మంది పిల్లలకు అడ్మిషన్లు

మూసీ నుంచి డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లకు తరలిన.. 169 మంది పిల్లలకు అడ్మిషన్లు
  • ఒకటి, రెండు రోజుల్లో జాయిన్​చేయనున్న అధికారులు
  • ఇష్టాన్ని బట్టి ప్రభుత్వ,  ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించనున్న విద్యాశాఖ 

హైదరాబాద్ సిటీ, వెలుగు : మూసీ రివర్​బెడ్ ​నిర్వాసితులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోంది. డబుల్​బెడ్​రూం ఇండ్లకు తరలిన మూసీ రివర్​బెడ్​నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి పిల్లల చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా సమీప స్కూళ్లలో అడ్మిషన్లు ఇప్పిస్తామని చెప్పింది. అన్నట్టుగానే డబుల్ బెడ్​రూం ఇండ్లకు తరలిన కుటుంబాలలోని చదువుకునే పిల్లలను సమీప ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ స్కూళ్లలో జాయిన్​ చేసేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 227 మూసీ రివర్​బెడ్ కుటుంబాలు డబుల్​ఇండ్లకు తరలగా, ఇందులో ఎక్కువ శాతం మలక్​పేటలోని పిల్లి గుడిసెలు, జియాగూడాలోని డబుల్​ఇండ్లకు వెళ్లారు. ఈ రెండు ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన జిల్లా విద్యాశాఖ అధికారులు పిల్లిగుడిసెల్లో 132 మంది, జియాగూడలో 37 మంది స్కూల్​స్టూడెంట్స్​ఉన్నారని గుర్తించారు. స్టూడెంట్స్​ఇష్టం మేరకు వీరిని డబుల్​ఇండ్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఒకటి, రెండు రోజుల్లో జాయిన్​ చేయనున్నారు. కాగా, ప్రభుత్వం ఇప్పటికే మూసీ రివర్​బెడ్​ నిర్వాసితులకు డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇవ్వడంతో పాటు, ఖర్చుల కోసం ప్రతీ కుటుంబానికి రూ.25 వేలు చెల్లిస్తోంది. వారి సమస్యల పరిష్కారం కోసం ఆయా జిల్లా జిల్లాల్లోని కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్స్​కూడా ఏర్పాటు చేసింది.  

ప్రభుత్వ, ప్రైవేట్ ... ఎక్కడైనా సరే..

మూసీ రివర్​బెడ్ ​నిర్వాసితుల పిల్లలకు సమీప స్కూళ్లలో అడ్మిషన్లు పొందేలా చూడాలనే ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు...డబుల్​ఇండ్లకు కిలోమీటర్​నుంచి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను మ్యాపింగ్ ​ద్వారా గుర్తించారు. దగ్గరలో ఉన్న రెసిడెన్షియల్​స్కూళ్లలో కూడా గుర్తించి అడ్మిషన్లు ఇప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రైవేట్​స్కూల్ యాజమాన్యాలతో కూడా సంప్రదింపులు జరిపారు. అయితే, కొందరు నిర్వాసితులు మాత్రం తమ పిల్లలను పాత ప్రైవేట్ స్కూళ్లలోనే చదివించడానికి ఇంట్రెస్టు చూపిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రైవేట్​స్కూళ్లకు ఫీజులు చెల్లించడం ఒక కారణమైతే, చాలా రోజుల నుంచి ఒకే స్కూల్​ లో చదువుతున్నారని, కొత్త స్కూల్​అయితే అలవాటు పడటానికి సమయం పడుతుందని, కొద్దిగా దూరమైనా రోజూ వెళ్లి వచ్చేలా పేరెంట్స్​ ఏర్పాట్లు చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. చాలా మంది మైనారిటీ రెసిడెన్షియల్​స్కూల్స్, ప్రభుత్వ స్కూళ్లలో జాయిన్​అవ్వడానికి, మరికొంతమంది ప్రైవేట్​స్కూల్స్​లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని, వారి ఇష్టం ప్రకారం ఆయా స్కూళ్లలో అడ్మిషన్లు ఇప్పిస్తామని అధికారులు చెబుతున్నారు. దసరా హాలీడేస్​ ముగిశాయి కాబట్టి  ఈ 169 మందిని ఆయా స్కూళ్లలో జాయిన్ చేస్తామని వెల్లడించారు.