
వికారాబాద్, వెలుగు: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలోని వివిధ క్రీడా అకాడమీ, వసతి గృహాల్లో 2025-– -26 ఏడాదికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం చదువుతున్న స్కూల్, కాలేజీ బోనఫైడ్ సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, క్రీడా ధ్రువీకరణ పత్రాలు, 10 పాస్ ఫోర్టు సైజ్ ఫోటోలతోపాటు ఒరిజినల్, జిరాక్స్ లతో ఉదయం 7.00 గంటలకు ఎంపిక ప్రదేశాలకు హాజరు కావాలన్నారు.
వాలీబాల్కు సంబంధించి జూన్ 1న సిద్దిపేట జిల్లాలోని వాలీబాల్ అకాడమీ, 10న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, రాజన్న సిరిసిల్ల మినీ స్టేడియంలో, 12, 13 తేదీల్లో మహబూబ్ నగర్ మెయిన్ స్టేడియం గ్రౌండ్ లో ఎంపికలు జరుగుతాయన్నారు. జూన్ 10, 11న సైక్లింగ్, రెజ్లింగ్ ఎంపికలు ఓయూ క్యాంపస్లోని వెలోడ్రోమ్ అకాడమీ, హనుమకొండలోని ప్రాంతీయ క్రీడా వసతి గృహంలో ఉంటాయన్నారు. జూన్10, 11 తేదీల్లో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్ ఎంపికలు హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థలో నిర్వహిస్తామన్నారు.
హాకీకి సంబంధించి జూన్ 12న వనపర్తిలోని డా. బాలకృష్ణయ్య మిని స్టేడియం, ఖమ్మం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో ఎంపికలు ఉంటాయన్నారు. జిమ్మాస్టిక్, సిమ్మింగ్కు 10 నుంచి 12 ఏండ్లు, అథ్లెటిక్స్, సైక్లింగ్, హ్యాండ్ బాల్, హాకీ, వాలీబాల్, రెజ్లింగ్కు 12 నుంచి 16 ఏండ్ల యస్సు పరిమితి ఉందన్నారు.