హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. గురువారం ( డిసెంబర్ 18) నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ రోజు రెండు గంటలకు కోర్టును పేల్చివేస్తామంటూ ఈ మెయిల్ పంపించారు. అలెర్ట్ అయిన పోలీసులు వెంటనే కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు.
గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బాంబ్ థ్రెట్ ఈ మెయిల్స్ పంపించారు దుండగులు.. దీంతో కోర్టు హాల్లోని న్యాయమూర్తులు, సిబ్బంది ,న్యాయవాదులను వెంటనే బయటకు పంపించి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు పోలీసులు. రంగంలోకి దిగిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీం తనిఖీలు చేపట్టారు. కోర్టు ఆవరణలో అణువణువూ గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించినట్లు అధికారిక సమాచారం లేదు.
గతంలో కూడా హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులు, రాజ్భవన్కు ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. అవన్నీ నకిలీవి అని తేలాయి. అయితే భద్రతా దృష్ట్యా పోలీసులు ప్రతిసారీ అత్యంత జాగ్రత్తగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
