ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం.. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి !

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం.. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి !

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్‌ నాసిర్జాదే మృతి చెందినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహ్మద్ పక్పూర్ కూడా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లు ఇజ్రాయెల్ మిలటరీ ఆపరేషన్స్కు సన్నిహితంగా ఉన్న రెండు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయని రాయిటర్స్ తెలిపింది.

ఇరాన్ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ చనిపోయాడంటూ ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు రావడం గమనార్హం. అయితే.. ఈ వార్తలను ఇరాన్ ఖండించింది. తమ సుప్రీం లీడర్‌ సురక్షితంగా ఉన్నారని ఇరాన్‌ ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇరాన్‌ అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు.

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ నివాసాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేశాయి. బాంబుల వర్షం కురిపించి ఖమేనీ ఇంటిని నేలమట్టం చేశాయి. తెహ్రాన్లోని ఖమేనీ ఇంటి కాంపౌండ్ తునాతునకలైంది. ఖమేని ఇల్లు ధ్వంసానికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ ఒక శాటిలైట్ ఇమేజ్ విడుదల చేసింది. 

అయితే.. అప్పటికే ఖమేనిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిసింది. ఇరాన్‌ ప్రెసిడెంట్‌ పిజిష్కియెన్‌ నివాసాలపై కూడా దాడులు ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసింది. ఇజ్రాయిల్‌, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్‌ దాడులు కూడా ప్రతి దాడులకు దిగింది.