పాక్ స్కోర్ 212.. అయినా తప్పని గండం.. శ్రీలంక స్కోర్ 147 దాటితే సెమీస్కు పోవుడు కష్టమే !

పాక్ స్కోర్ 212.. అయినా తప్పని గండం.. శ్రీలంక స్కోర్ 147 దాటితే సెమీస్కు పోవుడు కష్టమే !

టీ20 వరల్డ్ కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. 213 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంకకు నిర్దేశించింది. అయినప్పటికీ పాకిస్తాన్ జట్టుకు గండం పొంచి ఉంది. శ్రీలంక చేతిలో ఓడితే మాత్రమే పాక్ ఇంటి బాట పడుతుందనుకుంటే పొరపాటే.

పాక్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య సాధనలో శ్రీలంక స్కోర్ 147 పరుగులు దాటితే పాక్ సెమీస్ ఆశలు గల్లంతైనట్టే. శ్రీలంక స్కోర్ 147 పరుగుల దాటితే న్యూజిలాండ్ బెటర్ రన్ రేట్ కారణంగా సెమీస్కు చేరుతుంది. అప్పుడు పాకిస్తాన్ జట్టకు ఇంటికి పోవుడు తప్ప వేరే ఆప్షన్ లేదు.

పాక్ బౌలర్లు శ్రీలంక బ్యాటర్లను 147 పరుగుల లోపే కట్టడి చేయాలి. మంచి ఫామ్లో ఉన్న శ్రీలంక బ్యాటర్ నిస్సాంకను 3 పరుగులకే పాక్ ఔట్ చేసింది. కమిల్ మిశారాను అబ్రార్ అహ్మద్ బౌల్డ్ చేశాడు. మిశారా 15 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్తో 26 పరుగులు చేశాడు. రెండు కీలక వికెట్లను శ్రీలంక కోల్పోవడంతో.. శ్రీలంకను వీలైనంత తక్కువ స్కోర్కే కట్టడి చేయొచ్చనే కాన్ఫిడెన్స్ పాక్ జట్టులో కనిపించింది. పాక్ బ్యాటర్లు రాణించి బెటర్ స్కోర్ సాధించడం ఆ జట్టుకు కొంత కలిసొచ్చిన అంశం.

పాక్ బ్యాటర్లలో ఫర్హాన్ దూకుడుగా బ్యాటింగ్ చేసి.. 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులతో సెంచరీ చేశాడు. ఫఖర్ జమాన్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులతో 84 పరుగులు చేశాడు. 176 పరుగుల దగ్గర పాకిస్తాన్ తొలి వికెట్ పడిందంటే.. అప్పటి వరకూ ఈ ఇద్దరు పాక్ బ్యాటర్లు ఎంత దూకుడుగా ఆడారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో పాకిస్తాన్ జట్టు 212 పరుగులు చేసింది.