Naveen Ul Haq: కాబూల్పై ఎయిర్ స్ట్రైక్స్.. పాకిస్థాన్‌ను ఇజ్రాయెల్‌తో పోల్చిన ఆఫ్ఘన్ క్రికెటర్

Naveen Ul Haq: కాబూల్పై ఎయిర్ స్ట్రైక్స్.. పాకిస్థాన్‌ను ఇజ్రాయెల్‌తో పోల్చిన ఆఫ్ఘన్ క్రికెటర్

Naveen Ul Haq: పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. సోమవారం పాక్ వైమానిక దళం అఫ్ఘన్ పై మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో ముఖ్యంగా కాబుల్‌లోని ఒక మాదకద్రవ్య విముక్తి కేంద్రం లక్ష్యంగా బాంబులతో దాడి చేసింది. ఈ భీకర దాడిలో సుమారు 400 మంది చనిపోయినట్లు సమాచారం. మరో 250 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ దాడిపై ఆఫ్ఘన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ తదితరులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడిన స్టార్ బౌలర్ నవీన్ ఉల్ హక్ ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా పాకిస్థాన్ పై విమర్శలు గుప్పించారు. పాక్ ప్రభుత్వానికి, ఇజ్రాయెల్ పాలనకు మధ్య ఎలాంటి తేడా కనిపించడం లేదన్నారు. గాయం కారణంగా ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న నవీన్, తన దేశ ప్రజలపై జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఆఫ్ఘన్ క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు నివసించే ఇళ్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులను టార్గెట్ గా చేసుకుని దాడులు చేయడం దారుణం అన్నారు. అది తెలిసి చేసినా, తెలియక చేసినా క్షమించరాని నేరమని రషీద్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఇంత మంది ప్రాణాలు తీయడం అత్యంత బాధాకరం..  ఐక్యరాజ్యసమితి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆఫ్ఘన్ ప్రజలు ఎంతటి కష్టాన్ని అయినా తట్టుకుని మళ్ళీ నిలబడతారని రషీద్ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు.

ఆఫ్ఘన్ క్రికెటర్ల ఆరోపణలను పాకిస్థాన్ సర్కార్ తోసిపుచ్చింది. తాము ఆసుపత్రిపై దాడి చేయలేదు, కేవలం ఉగ్రవాద స్థావరాలు, ఆయుధ గిడ్డంగులను మాత్రమే టార్గెట్ చేసుకుని.. దాడి చేసినట్లు పాక్ సమాచార మంత్రిత్వ శాఖ తెలియజేశారు. ఆసుపత్రిపై దాడి జరిగిందన్న వార్తలు పూర్తిగా తప్పు అన్నారు. పాక్ చేసిన దాడుల్లో సామాన్య పౌరులే ఎక్కువగా చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాక్– ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.