కాబూల్/ఇస్లామాబాద్: పాకిస్తాన్ భూ భాగంలోని ఐఎస్ స్థావరాలు, టెర్రరిస్ట్ శిబిరాలపై అఫ్గానిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. ఈమేరకు అఫ్గానిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’లో ఒక ప్రకటన విడుదల చేసింది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో ఉన్న పలు ఐఎస్ స్థావరాలు, టెర్రరిస్ట్ శిబిరాలపై కచ్చితత్వంతో తమ వైమానిక దళం దాడి చేసిందని తెలిపింది. బలూచిస్తాన్లోని గులిస్తాన్, షకర్ అబ్ జంగిల్గర్ది ప్రాంతాల్లోని టెర్రర్ స్థావరాలను ధ్వంసం చేసినట్లు అఫ్గాన్ డిఫెన్స్ శాఖ వెల్లడించింది.
అఫ్గానిస్తాన్పై దాడులు చేయడానికి, ప్రణాళికలు రచించడానికి ఉపయోగపడుతున్న టెర్రరిస్టుల స్థావరాలను మొత్తం నేలమట్టం చేశామని పేర్కొంది. గతంలో అఫ్గానిస్తాన్లో జరిగిన పలు దాడులకు ప్రణాళికలు ఇక్కడి నుంచే జరిగాయని ఆరోపించింది. కాగా, అఫ్గాన్ దాడులపై పాకిస్తాన్ అధికారిక వర్గాలు ఇప్పటివరకు స్పందించలేదు.
