
- ఆఫీస్ అద్దాలు, కార్లు, న్యూస్ స్టూడియో, కెమెరాలు ధ్వంసం
- కేటీఆర్పై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎటాక్
- ఆఫీసుకు వెళ్లి పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం
- నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడి
- మీడియా ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నరు: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: ‘మహా’ న్యూస్ ఆఫీసుపై బీఆర్ఎస్నేతలు దాడికి పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్వ్యవహారంలోకేటీఆర్పై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహా న్యూస్ఆఫీసు వద్దకు చేరుకున్న బీఆర్ఎస్కార్యకర్తలు.. ఆఫీసు అద్దాలను పగులగొట్టారు. బయట పార్క్చేసిన కార్లను ధ్వంసం చేశారు.
ఆఫీసు లోపలికి ప్రవేశించి న్యూస్స్టూడియో, కెమెరాలనూ ధ్వంసం చేశారు. ఆఫీసు సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగలేదు. దాడి జరిగిన విషయం తెలుసుకుని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్వేర్వేరుగా మహా న్యూస్ కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు.
చానెల్ ఎండీ వంశీకృష్ణతో మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ‘‘మీడియాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియాలో వచ్చే కథనాలపై అభ్యంతరాలుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. దాడి చేసినోళ్లను గుర్తించామని, వాళ్లను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాగా, మహా న్యూస్పై దాడిని మంత్రి సీతక్క, పీసీసీ చీఫ్మహేశ్కుమార్గౌడ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు ఖండించారు.
వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నరు: కేటీఆర్
తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దాడి ఘటనపై ఆయన స్పందించారు. మీడియా ముసుగులో కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ఆరోపించారు. ‘‘కొందరు మీడియా సంస్థల యజమానులు నాపై, మా పార్టీ నాయకులపై విషం చిమ్ముతున్నారు. పదే పదే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులపై తీవ్రమైన ప్రభావం పడుతున్నది. ఈ తప్పుడు కథనాలు నా శ్రేయోభిలాషులు, పార్టీ నేతలు, శ్రేణులను బాధిస్తున్నాయి. దీన్ని వెనుకుండి నడిపిస్తున్న వారితో పాటు నాపై నీచమైన ప్రచారం చేస్తున్న వారికి చట్టపరంగానే బుద్ధి చెబుతాను” అని తెలిపారు.
‘‘మెయిన్స్ట్రీమ్మీడియాకూ దిగజారుడు రాజకీయాలను తీసుకొచ్చిన పాపం సీఎం రేవంత్, ఆయన మిత్రులదే. బీఆర్ఎస్నేతలు, కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలి. దాడులు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటు లేదు. రేవంత్లాంటి వ్యక్తి రాష్ట్రాన్ని నడిపిస్తుంటే అబద్ధాలు, దుష్ప్రచారాలు సమాజంలో రోజువారీ అంశాలుగా మారిపోతాయి” అని అన్నారు.
బీఆర్ఎస్ లీగల్ నోటీసులు..
ఫోన్ట్యాపింగ్వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ మహా న్యూస్కు బీఆర్ఎస్ లీగల్ నోటీసులు ఇచ్చింది. ‘‘జర్నలిజం ముసుగులో కొన్ని రోజులుగా తప్పుడు థంబ్ నెయిల్స్తో మహా న్యూస్ వార్తలు ప్రసారం చేస్తున్నది. ఈ విషయంలో పలుమార్లు విజ్ఞప్తులు చేసినా తన తీరును మార్చుకోలేదు. ప్రభుత్వంలోని కొందరు నాయకులతో చేతులు కలిపి దుష్ప్రచారం చేస్తున్నది. ఇప్పటికైనా మహా న్యూస్ తన తీరు మార్చుకోకుంటే పరువు నష్టం దావా వేస్తం” అని హెచ్చరించింది.
ఇది హేయమైన చర్య..
మహా న్యూస్ ఆఫీసుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమర్థనీయం కాదు.
సీఎం రేవంత్ రెడ్డి
ఇలాంటి దాడులను సహించం..
మహా న్యూస్ ఆఫీసుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభం లాంటిది. ప్రజల మనోభావాలను ప్రతిబింబించే మీడియా సంస్థలపై దాడులకు తావుండకూడదు. ఇలాంటి దాడులను సహించం. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు.
మంత్రి వివేక్ వెంకటస్వామి
మా పార్టీ ఆఫీసులోకి ఎట్లొస్తరు?
తెలంగాణ భవన్ వద్ద పోలీసులను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మహా న్యూస్ ఆఫీసుపై దాడి చేసిన బీఆర్ఎస్వీ నేతలను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులను ఆ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. బాల్క సుమన్, మధుసూదనాచారి, తాతా మధు తదితరులు పోలీసులను అడ్డుకున్నారు.
సెర్చ్ వారెంట్ లేకుండా ప్రతిపక్ష పార్టీ ఆఫీసులోకి ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులపై బాల్క సుమన్ దురుసుగా ప్రవర్తించారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి, మీరే బతకండి.. మేం అడవుల్లోకి వెళ్లిపోతాం’’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ నేతలకు పోలీసులు సర్ది చెప్పి.. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.