అప్పుల ఊబిలో ఏజెన్సీ వాసులు

అప్పుల ఊబిలో ఏజెన్సీ వాసులు

ఆరుగాలం కష్టించిన రైతులు ప్రత్యేకించి సన్న, చిన్నకారు రైతులకు పండించిన పంటకు గిట్టుబాట ధర లేకపోగా సరైన ఆదరణ లభించడం లేదనేది సుస్పష్టమైన విషయం.  పంటకోసం తెచ్చిన అప్పులు తీర్చేందుకు రైతులు నరకయాతన పడుతున్నారు. వడ్డీకి వడ్డీ వసూలు చేసుకుంటూ దళారులు మోసానికి పాల్పడుతుండటంతో అన్నదాతల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఏడాదికి ఒకే పంట పండించే ఏజెన్సీ ప్రాంతాలలో అప్పు చేయని రైతు కుటుంబమే కన్పించదు.  ఆదివాసీ రైతులు దళారుల వలలో చిక్కుకొని మోసపోతూ ఆర్థికంగా నష్టపోతున్నారు.  

వానాకాలం (ఖరీఫ్ పంటకు) షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షపాతం సగటుగా ఉంటున్నప్పటికీ, పెద్ద చెరువులు, లిఫ్ట్ ఇరిగేషన్, బోర్లు, బావులు లేక మరోపక్క కరెంటు కనికరించక ఏడాదికి ఒకే పంటతో సరిపుచ్చుకుంటున్నారు. అనేక ఏజెన్సీ ప్రాంతాల్లో యాసంగి అనేదే కన్పించదు. 

మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కాకతీయులు నిర్మించిన పాకాల సరస్సు, బయ్యారం పెద్ద చెరువు ఉన్నాయి. ఏజెన్సీ అడవుల నుంచి పాకాలలో చేరే వాన నీరు ఆయకట్టు కింద 28,512 ఎకరాల సాగుకు, అదీ గిరిజనేతర రైతులకే తోడ్పడుతోంది. తప్ప ఒక్క ఆదివాసీ రైతుకు కూడా ఉపయోగపడటం లేదు. 

వడ్డీ వ్యాపారుల ఆగడాలు 

ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వడ్డీ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి ఏజెన్సీ ఏరియాకి వస్తుంటారు.  స్థానిక వ్యాపారులతోపాటు వీరు కూడా విత్తనాలు, పెట్టుబడి ఇస్తామంటూ మాయమాటలు చెబుతారు. బ్యాంకు రుణం దొరకని రైతులు తప్పనిసరి పరిస్థితులలో వీరి నుంచి విత్తనాలు, ఎరువులు, అప్పు తీసుకుంటారు.  

పంట చేతికొచ్చేవరకు అంతా వడ్డీ వ్యాపారి కనుసన్నలలోనే సాగు పనులు నడుస్తాయి. వ్యాపారులు 10 నుంచి 15 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఒకవేళ అప్పు చెల్లించే స్తోమత లేని రైతుల నుంచి వారి కాడెడ్లను సైతం కబేళాలకు తరలించడం,  వస్తువులను స్వాధీనపర్చుకోవడం ఆనవాయితీగా మారింది.  ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ప్రాంతాల ఆదివాసీ రైతులకు చాలామందికి అటవీ హక్కుపత్రాలు ఇవ్వకపోవడంతో బ్యాంకు రుణాలు అందటంలేదు. 

అమలుకాని 1960 చట్టం 

గిరిజనుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని వడ్డీ వ్యాపారస్థులు చేస్తున్న మోసాలు అరికట్టేందుకు ప్రభుత్వం ఏజెన్సీలో వడ్డీ వ్యాపార నిబంధన చట్టం - 1960ను రూపొందించింది. దీని ప్రకారం నాము, సిరి నాము (నాము అంటే బస్తాకు రెండు బస్తాలు, సిరినాము అంటే బస్తాకు బస్తాన్నర) పేరుతో పంటల మీద వడ్డీకి అప్పులు, బంగారు ఆభరణాలు, వస్తువులు తదితరాలు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వడం నిషేధం.  రుణ గ్రహీతల నుంచి వడ్డీ వసూలు చేసే సమయంలో వారిని నిర్బంధాన్ని గురిచేసినా, బెదిరించినా లేదా ఆస్తులకు ఆటంకం  కలిగించినా శిక్ష, జరిమానా లేదా రెండూ ఉంటాయి.  కానీ, ఇవేవీ సక్రమంగా అమలు కావటం లేదు. 

రుణాలు మంజూరు చేయాలి 

అటవీ హక్కుల చట్టం - 2005 ప్రకారం తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు అటవీ హక్కు పత్రాల పంపిణీ చేసింది. ఆదివాసీ ప్రాంతాల్లో వారసత్వంగా సాగుచేసుకుంటున్న పోడు భూములకు హక్కుపత్రాలు అందడం లేదు. ఇచ్చిన పత్రాలకు రుణాలు ఇవ్వడం లేదు. మిషన్ కాకతీయ వల్ల సాగు విస్తీర్ణం 51 శాతం పెరిగింది. పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందిస్తున్న  రైతుబంధు సాయం వల్ల కొంత మేలు జరుగుతోంది.

 అకాల వైపరీత్యాల వల్ల జరిగే పంట నష్టాన్ని అరికట్టేందుకు రైతులకు తగిన నష్టపరిహారం, రుణమాఫీ అమలు చేయాలి. త్వరలో రైతులందరికీ పెట్టుబడిగా ఇవ్వబోయే ముందస్తు సాయం, రుణాలు సకాలంలో అందించి ఏజెన్సీ ప్రాంత అన్నదాతలను ఆదుకోవాలి.  అలాగే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వడ్డీ వ్యాపారస్తులను కఠినంగా శిక్షించాలి.

- గుమ్మడి లక్ష్మీనారాయణ,ఆదివాసీరచయితల వేదిక-