AIతో ఉద్యోగాలు పోవటం పక్కా.. "గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ" జియోఫ్రీ హింటన్ కామెంట్స్..! ఎవరు సేఫ్

AIతో ఉద్యోగాలు పోవటం పక్కా.. "గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ" జియోఫ్రీ హింటన్ కామెంట్స్..! ఎవరు సేఫ్

ఏఐ ప్రస్తుతం ప్రపంచాన్ని మార్చేస్తున్న సాంకేతికత. అయితే ఇది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులను సైతం భయానికి గురిచేస్తోంది. దిగ్గజ సంస్థలు సైతం వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గిస్తూ పోవటం వారి స్థానాలను ఏఐ భర్తీ చేయటం ఆందోళనలకు కారణంగా మారింది. అయితే దీని ప్రభావం దీనిని సృష్టికర్తే చెబితే ఎలా ఉంటుంది. ఆయన ఆందోళన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఏఐ టెక్నాలజీలపై 78 ఏళ్ల జియోఫ్రీ హింటన్ చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అని పిలువబడే జియోఫ్రీ గతంలో గూగుల్ కంపెనీలో పనిచేశారు. ఆయన 1970ల నుంచి న్యూరల్ నెట్వర్క్స్ పై చేసిన పరిశోధనలకు గాను 2024లో నోబెల్ బహుమతిని కూడా అందుకున్నారు. ఏఐ రానున్న కాలంలో భారీ తొలగింపుల ప్రమాదానికి దారితీస్తుందన్నారు. మెల్లగా వైట్ కాలర్ జాబ్స్ ను ఏఐ రీప్లేస్ చేస్తుందని వెల్లడించారు. అయితే కొన్ని రంగాలు మాత్రం ఏఐ వల్ల ప్రభావితం కావని అన్నారు.

కొన్ని సంవత్సరాల్లోనే ప్రతి పనినీ ఏఐ రీప్లేస్ చేస్తుందని చెప్పారు. న్యాయ సేవల నుంచి కాల్ సెంటర్ల వరకు ఉద్యోగాలు మాయం అవుతాయన్నారు. ఏఐ చేయలేని స్కిల్స్ మీ దగ్గర ఉంటేనే భవిష్యత్తులో జాబ్ మనుగడ ఉంటుందని ఒక్కమాటలో తేల్చి చెప్పారు. అంటే ఏఐ చేయలేని పనులకు మాత్రమే మనుషులకు అవకాశాలన్నమాట. ప్రస్తుతం చాలా సంస్థలు మనుషులకు ఏఐని అసిస్టెంట్ గా వినియోగిస్తున్నారు. దీని వల్ల పది మంది చేసే పనిని ఒక్కరే చేయగలుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగాల వేటలోకి వస్తున్న వేల మందికి అవకాశాలు లేకుండా ఏఐ చేస్తోందన్నారు. 

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాల్ సెంటర్ జాబ్స్ అనే మాట కష్టమేనన్నారు. ఈ రంగంలో వాడుతున్న ఏఐ, ఆటోమేషన్ ఉద్యోగుల అవసరాన్ని దాదాపుగా తగ్గించేసిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో జెన్జీలు వైట్ కాలర్ జాబ్స్ నుంచి బ్లూకాలర్ జాబ్స్ వైపు మళ్లుతున్న సమయంలో జియోఫ్రీ హింటన్ కామెంట్స్ రావటం గమనార్హం.