
- సంస్థాగతంగా పార్టీ బలోపేతం, డీసీసీల నియామకంపై వీరిచ్చే రిపోర్టే కీలకం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇప్పటికే పీసీసీ అబ్జర్వర్లను నియమించిన పార్టీ హైకమాండ్, ఇప్పుడు ఏఐసీసీ తరఫున రాష్ట్రంలో జిల్లాకో అబ్జర్వర్ నియామకంపై దృష్టి పెట్టింది. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలకు ప్రభుత్వం రెడీ అవుతుండడంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేందుకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టి పెట్టారు.
జిల్లాల వారిగా పార్టీ పరిస్థితి ఎలా ఉంది, నాయకుల మధ్య సమన్వయం ఉందా, లేదా...డీసీసీ అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తే బాగుంటుంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు జనంలోకి ఎలా వెళ్తున్నాయి..వంటి పూర్తి వివరాలను ఏఐసీసీ అబ్జర్వర్లు ఇటు ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కు పంపించనున్నారు. ఈ నివేదిక ఆధారంగానే ఆ ఇద్దరు నేతలు డీసీసీ చీఫ్ లను నియమించనున్నారు.
ఇప్పటికే పీసీసీ అబ్జర్వర్లు ఈ అంశాలపై మీనాక్షి నటరాజన్ కు, మహేశ్ గౌడ్ కు నివేదికలు ఇచారు. ఏఐసీసీ అబ్జర్వర్లు ఇచ్చే నివేదికతో వీటిని సరిపోల్చుకొని ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం 33 జిల్లాలకు అబ్జర్వర్లను నియమించనున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు మాత్రమే ఏఐసీసీ అబ్జర్వర్లుగా ఇక్కడకు రానున్నారు.
దీంతో పార్టీకి నిబద్ధతతో పనిచేసే వారినే డీసీసీ ప్రెసిడెంట్గా నియమించాలని ఏఐసీసీ అబ్జర్వర్లు హైకమాండ్ కు సిఫారసు చేయనున్నారు. ఇతర రాష్ట్రాల నేతలు ఇక్కడకు ఏఐసీసీ అబ్జర్వర్లుగా వస్తున్నందున స్థానిక నేతల లాబీయింగ్ కు చెక్ పడనుందని పీసీసీలో చర్చ సాగుతోంది. జనంలో ఉన్న నేతలకే, పార్టీ కోసం పనిచేసే వారికే ఈ అబ్జర్వర్లు సిఫారసు చేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు