- ఢిల్లీ, జోధ్పూర్, రిషికేశ్ ఎయిమ్స్ డాక్టర్లతో కలిసి పని చేయనున్న బీబీ నగర్ డాక్టర్లు
- ఇక కాపీ పేస్ట్ రీసెర్చ్కు చెక్.. డేటా, టెక్నాలజీ షేరింగ్కు గ్రీన్సిగ్నల్
- ఫ్లోరోసిస్, కిడ్నీ సమస్యలపై జాతీయ స్థాయిలో రీసెర్చ్కు చాన్స్
హైదరాబాద్, వెలుగు: దేశంలోని వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్)లన్ని చేతులు కలిపాయి. మెరుగైన పరిశోధనలే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఉన్న 20 ఎయిమ్స్ సంస్థలు ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇన్ని రోజలు రీసెర్చ్లకు సంబంధించి ఎవరిదారి వారిదే అన్నట్లు ఉన్న ఏయిమ్స్లు.. పాన్ ఇండియా కొలబొరేటీవ్ రీసెర్చ్ కన్సార్టియం పేరుతో ఒక్కటయ్యాయి.
ఇందులో మన రాష్ట్రంలోని బీబీనగర్ ఎయిమ్స్ కూడా కీలక భాగస్వామిగా మారింది. ఈ కూటమిలో మనోళ్లకు చోటు దక్కడంతో.. ఢిల్లీ, జోధ్పూర్, రిషికేశ్ లాంటి సీనియర్ ఎయిమ్స్లతో సమానంగా బీబీనగర్కు కూడా ప్రయారిటీ దక్కనుంది. దీనివల్ల దేశమంతా ఒకేసారి భారీ క్లినికల్ ట్రయల్స్, ప్రయోగాలకు వీలుంటుంది.
కాపీ పేస్ట్ రీసెర్చ్లకు చెక్...
ఈ ఒప్పందం వల్ల మన డాక్టర్లకు, స్టూడెంట్లకు చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా కాపీ పేస్ట్ రీసెర్చ్కు చెక్ పడనుంది. ఒకరు చేసిన ప్రయోగాన్నే తెలియక మరొకరు చేసి టైం, మనీ వేస్ట్ చేయకుండా.. ఒకరి డేటాను మరొకరు వాడుకునే వెసులుబాటు కలుగుతుంది. మన దగ్గర లేని అత్యాధునిక ల్యాబ్లు, టెక్నాలజీ ఢిల్లీలో ఉంటే.. మన డాక్టర్లు వాటిని వాడుకోవచ్చు.
ఒంటరిగా కాకుండా ఉమ్మడిగా వెళ్లడం వల్ల పెద్దపెద్ద ప్రాజెక్టులకు అంతర్జాతీయ సంస్థల నుంచి ఫండ్స్ తెచ్చుకోవడం బీబీనగర్కు ఈజీ అవుతుంది. సీనియర్ ప్రొఫెసర్ల గైడెన్స్ దొరుకుతుంది కాబట్టి.. మన డాక్టర్లు ఇంటర్నేషనల్ లెవెల్లో జర్నల్స్ పబ్లిష్ చేసేందుకు, వైద్యంలో కొత్త విషయాలు కనిపెట్టేందుకు ఈ ఉమ్మడి ఒప్పందం ఉపయోగపడనుంది.
మన వ్యాధులపై రీసెర్చ్కు అవకాశం..
మన దగ్గర ఎక్కువగా ఉండే ఫ్లోరోసిస్, కిడ్నీ జబ్బులు, సికిల్ సెల్ ఎనీమియా వంటి సమస్యలపై ఇప్పుడు నేషనల్ లెవెల్లో రీసెర్చ్ జరిగే అవకాశం ఉంది. ఈ అలయన్స్ వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది పేషెంట్ల డేటా ఒకే దగ్గర ఉండటంతో జబ్బుల మూలాలను కనిపెట్టడం సులభం అవుతుంది. ఏదైనా కొత్త మందు కనిపెడితే ఈ నెట్వర్క్ వల్ల ఒకేసారి ఢిల్లీ, బీబీనగర్, జోధ్పూర్, రిషికేశ్.. ఇలా అన్ని చోట్ల క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు.
దీనివల్ల మన దేశంలోని విభిన్న వాతావరణం, వివిధ రకాల మనుషులపై మందులు ఎలా పనిచేస్తున్నాయో ఫాస్ట్గా తెలుస్తుంది. దీనివల్ల పేషెంట్లకు కొత్త ట్రీట్మెంట్స్ అందుబాటులోకి రావడం చాలా ఈజీ అవుతుంది. లేటెస్ట్ ట్రీట్మెంట్, మందులు పేషెంట్లకు ఫ్రీగా లేదా తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
