- ఈ హాస్పిటల్కు ఇప్పటికే రూ.1,000 కోట్లు మంజూరు చేశాం: జేపీ నడ్డా
- ప్రతిరోజూ 1,800 మంది పేషెంట్లకు సేలందిస్తున్నామని వెల్లడి
- యాదాద్రి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ను సందర్శించిన కేంద్ర మంత్రి
యాదాద్రి, వెలుగు: బీబీనగర్ ఎయిమ్స్లో అత్యున్నత స్థాయిలో ట్రీట్మెంట్ అందించడంతో పాటు పరిశోధనలకు ప్రాధాన్యమిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు సాగుతున్నాయని తెలిపారు. పరిశోధనల కోసం ఇప్పటివరకు రూ.64 కోట్ల గ్రాంట్లు మంజూరు చేశామన్నారు. ఎయిమ్స్లో ప్రస్తుతం 129 ప్రాజెక్టులపై రీసెర్చ్ జరుగుతున్నాయన్నారు. పరిశోధనలు చేస్తున్న ప్యాకల్టీ ఇప్పటివరకు 156 పరిశోధనా పత్రాలను ప్రచురించారని వెల్లడించారు. గురువారం యాదాద్రి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్ను నడ్డా సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ఆఫీసర్లతో ఆయన రివ్యూ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్లో పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి 20 ఏండ్లు పట్టిందని, బీబీనగర్లో మాత్రం నాలుగేండ్లలోనే సేవలు అందించగలిగామని తెలిపారు.
ఇప్పటికే రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులు మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.110 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 132 మంది ఫ్యాకల్టీ సభ్యులు, 133 మంది సీనియర్ డాక్టర్లు సేవలందిస్తున్నారని చెప్పారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులతో పాటు 24 విభాగాలలో ఎండీ, 5 విభాగాలలో డీఎం, ఎంసీహెచ్ వంటి సూపర్ స్పెషాలిటీ కోర్సులు కూడా అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఓపీడీ విభాగంలో ప్రతిరోజూ సుమారు 1,800 మంది రోగులు వైద్య సేవలు పొందుతున్నారని చెప్పారు. ‘ఈ -సంజీవని’ డిజిటల్ టెలిమెడిసిన్ ద్వారా ఇప్పటివరకు 1,56,000 మంది రోగులకు విజయవంతంగా వైద్య సలహాలు అందించారని వెల్లడించారు. దేశంలోనే బీబీనగర్ ఎయిమ్స్లో ‘కమ్యూనిటీ రేడియో స్టేషన్’ ప్రారంభించామని ఆయన వివరించారు.
బలమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించాం..
ప్రధాని మోదీ నేతృత్వంలో దశాబ్ద కాలంలోనే దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవలు, మౌలిక వసతుల రంగంలో గొప్ప ముందుడుగు పడిందని జేపీ నడ్డా తెలిపారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆరోగ్య సేవలకు ప్రాధాన్యమిచ్చారని వివరించారు. ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం వరకు అనుసంధానం చేసి దేశంలో బలమైన ఆరోగ్య వ్యసస్థను నిర్మించామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 18 ఎయిమ్స్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగా, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. మెడికల్ కాలేజీలు 820 పెంచామన్నారు. ఆయన వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ డీకే అరుణ, బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు, నాయకులు ఉన్నారు.
రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయిస్తుంటే.. ఇక్కడి కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఆ సొమ్మును ఢిల్లీకి తరలిస్తూ రాష్ట్రాన్ని ఏటీఎంలా వాడుకుంటోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ఇదే తరహా అవినీతికి పాల్పడిందని విమర్శించారు. గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన ‘ప్రజాస్వామ్యం – దౌత్యం– అభివృద్ధి’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రం పన్నుల వాటా కింద తెలంగాణకు రూ. 2.74 లక్షల కోట్లు, నేషనల్ హైవేల కోసం రూ. 1.74 లక్షల కోట్లు, పవర్ ప్రాజెక్టుల కోసం రూ. 44,400 కోట్లు ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు.
దేశంలో 3 కోట్ల మంది 'లఖ్పతి దీదీలను' తయారుచేయడమే లక్ష్యమని, కేవలం తెలంగాణలోనే 17.17 లక్షల మంది లఖ్పతి దీదీలు తయారయ్యారని హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 4.3 లక్షల కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్ల నిర్మాణం, డీబీటీ ద్వారా రూ. 51 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేసి, రూ. 4.3 లక్షల కోట్ల అవినీతి లీకేజీలను అరికట్టామని వివరించారు. వసుదైవ కుటుంబకమ్ స్ఫూర్తితో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ వంటి పొరుగు దేశాలకు రైల్వే సాంకేతికతను, లోకోమోటివ్ లను అందిస్తూ బాసటగా నిలిచామని వెల్లడించారు. రక్షణ రంగం బలోపేతం కావడం వల్లే దేశంలో నక్సలిజం కేవలం రెండు జిల్లాలకే పరిమితమైందన్నారు. 12 ఏండ్లలో భారత రాజకీయ సంస్కృతిలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని నడ్డా కొనియాడారు.
